
నెల్లూరు: ఏపీ రాష్ట్రంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారనే అనుమానంతో హై అలెర్ట్ ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలం పన్నపూడి పాతవూరులో రెండు రోజుల క్రితం శ్రీలంక రిజిస్ట్రేషన్తో ఉంది. రెండు రోజుల క్రితం ఈ బోటును స్థానిక మత్స్యకారులు గుర్తించారు. ఈ బోటును మత్స్యకారులు ఒడ్డుకు తీసుకొచ్చారు.
శ్రీలంకలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఏపీలో ప్రవేశించారా అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. పోర్టులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.
శ్రీలంక రిజిస్ట్రేషన్తో కూడిన బోటు లభించిన ప్రాంతం కృష్ణపట్నం పోర్టుకు ఉత్తర దిశన 10-15 కి.మీ.దూరంలో, షార్కు ఉత్తరదిశన 50 కి.మీ. దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఎవరైనా ఆ బోటులో వచ్చి ఉంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ బోటులో ఖాళీ మంచినీళ్ల బాటిల్, రెండు ఇంధన క్యాన్లు, ఒక బెడ్షీట్ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తనిఖీలను ముమ్మరం చేశారు.