
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో జరిగిన ఓ కాంక్లేవ్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, జగన్ ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పథకాల పేరుతో డబ్బులు ఇస్తున్నారని దాని వల్ల ఓట్లు పడవన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఓటమికి కూడా అదే కారణమన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమన్న పీకే.. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. ఈసారి ఏం చేసినా జగన్ గెలవడం కష్టమని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు.
కాగా.. గత ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో జగన్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ప్రశాంత్ చెప్పారు. ఆయన జోస్యం ఫలించి జగన్ 175 స్థానాలకు గాను 151 సీట్లు గెలిచి సీఎంగా పగ్గాలు అందుకున్నారు. అంతేకాదు.. బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పీకే అంచనాలు నిజమయ్యాయి. ఇప్పుడు తాజాగా టీడీపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని చెప్పడంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ నెలకొంది.