జగన్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు షాక్: పోతిరెడ్డిపాడుకు బ్రేక్

By narsimha lodeFirst Published Jul 30, 2020, 11:04 AM IST
Highlights

రాయలసీమ ఎత్తిపోతల పథకం (పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంపు) ప్రాజెక్టు పై ముందుకు వెళ్లొద్దని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఏపీ ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం (పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంపు) ప్రాజెక్టు పై ముందుకు వెళ్లొద్దని కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఏపీ ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి  కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనా లేఖ రాశారు.

ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారంగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే కృష్ణా బోర్డుకు సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందేనని ఆయన ఆ లేఖలో కోరారు. ఈ నివేదికను అపెక్స్ కౌన్సిల్ కు పంపాలి. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు పొందిన తర్వాతే ప్రాజెక్టు  నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుందని హరికేష్ మీనా చెప్పారు. ఏపీ ఇరిగేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ పంపారు.

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యం పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అంతేకాదు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లకు నోటిఫికేషన్ ను కూడ జారీ చేసింది. పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

also read:అందరి చూపు అపెక్స్ కౌన్సిల్‌ మీటింగ్‌పైనే: పోతిరెడ్డిపాడుపై తగ్గని జగన్, కేసీఆర్ ఏం చేస్తారు?

ఈ ప్రాజెక్టు పూర్తైతే తెలంగాణ ఏడారిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ , నల్గొండ జిల్లాల్లో కనీసం మంచినీటి ప్రాజెక్టులకు కూడ నీరు దొరకని పరిస్థితి ఉంటుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మానంపై మండిపడుతోంది.  

ఈ విషయమై ఇప్పటికే కృష్ణా ట్రిబ్యునల్ కు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. మరో వైపు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడ ఇదే విషయమై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తనుంది. 

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది మే 5వ తేదీన 203 జీవోను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సుమారు రూ. 7 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తూ ఈ నెల  27వ తేదీన ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జ్యుడిషియల్‌ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులు వెల్లడించారు.

ఆగష్టు 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ ధరఖాస్తులను స్వీకరించనున్నారు. 13న టెక్నికల్ బిడ్ తెరిచి, 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.19న టెండర్‌ను ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం వద్ద రోజుకి 34,722 క్యూసెక్కుల నీరు ఎత్తిపోయడమే లక్ష్యంగా పథకాన్ని రూపకల్పన చేశారు.

click me!