మచిలీపట్నం వైసీపీలో ముసలం : మరోసారి ఎంపీ vs ఎమ్మెల్యే.. బాలశౌరి పాల్గొన్న కార్యక్రమానికి పేర్ని నాని డుమ్మా

By Siva KodatiFirst Published Jan 17, 2023, 3:47 PM IST
Highlights

కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీలో మరోసారి స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని, ఎంపీ బాలశౌరీ వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాజాగా ఎంపీ పాల్గొన్న కార్యక్రమానికి పేర్ని నాని డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. 

కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గున్నామి. స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని, ఎంపీ బాలశౌరీ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో స్పందన మీటింగ్ హాల్‌ను నూతనంగా నిర్మించారు. దీని నిమిత్తం బాలశౌరీ తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.15 లక్షలు వెచ్చించారు. ఈ రోజు మీటింగ్ హాల్ సందర్భంగా పోలీస్ శాఖ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు అందాయి. అయితే అధికారిక కార్యక్రమానికి మాజీ మంత్రి పేర్ని నాని డుమ్మా కొట్టారు.

కాగా.. నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆగ‌డాల‌కు అడ్డూ అదుపు లేకుండా పోయింద‌ని వైసీపీ ఎంపీ బాల‌శౌరి ఆరోపించడం గతేడాది హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతుంది. మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంచిలీపట్నంలో వైసీపీ పంచాయితీపై తాజాగా ఆ పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. బాలశౌరికి ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మీడియాతో మాట్లాడవద్దని పార్టీ పెద్దలు బాలశౌరికి చెప్పినట్టుగా సమాచారం.

అసలేం జరిగింది.. 

మచిలీపట్నం వైసీపీలో కొంతకాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న వర్గ విభేదాలు. ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎంపీ వల్లభనేని బాలశారి పర్యటనను వైకాపాకే చెందిన నగర కార్పొరేటర్ అడ్డుకునే ప్రయత్నం చేయటం గతేడాది మచిలీపట్టణంలో ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ కోసం పనిచేసినా బాలశౌరి ప్రాధాన్యతివ్వడం లేదంటూ.. పేర్నినాని అనుచరుడు అజ్గర్‌ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాలశౌరి పర్యటనను అజ్గర్‌ వర్గీయులు అడ్డుకున్నారు. బాలశౌరి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం జగన్ చెప్పారనే బాలశౌరిని గెలిపించామని .. కానీ తమను ఎంపీ పట్టించుకోవడం లేదంటూ అజ్గర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే తనను అడ్డుకోవడంపై ఎంపీ బాలశౌరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేర్ని నాని తనను మచిలీపట్నం రానీయకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని ఆరోపించారు. టీడీపీ నేత కొనకళ్లతో అధికార పార్టీ ఎమ్మెల్యే పనేంటీ అని ఎంపీ నిలదీశారు. వైసీపీ ఏదారి పడుతోందో ప్రజలకే అర్ధం కావడం లేదంటూ బాలశౌరి అన్నారు. తాటాకు చప్పుళ్లకు, ఊడుత ఊపుళ్లకు భయపడేది లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంను విమర్శించిన కార్యక్రమంలో పేర్ని నాని ఎందుకు పాల్గొన్నారని బాలశౌరీ ప్రశ్నించారు. సుజనా చౌదరి, పేర్ని నాని ఒకరినొకరు పొగుడుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 
 

click me!