హైకోర్టులో దేవినేని ఉమా బెయిల్ పిటిషన్... కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన చంద్రబాబు

By Siva KodatiFirst Published Jul 29, 2021, 7:21 PM IST
Highlights

హత్యాయత్నం, కుట్ర, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం దేవినేని రాజమండ్రి జైల్లో వున్నారు.

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపీ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కృష్ణాజిల్లా జి.కొండూరు పోలీసులు తనపై  హత్యాయత్నం, కుట్ర, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అన్యాయంగా పెట్టారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవని...  పిటిషనర్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయవాది కోరారు.   

మరోవైపు దేవినేని ఉమా కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకే కక్షపూరితంగా ఉమాను అరెస్టు చేశారని మండిపడ్డారు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉమా రాత్రింబవళ్లు పనిచేశారని, జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని టీడీపీ అధినేత ఆకాంక్షించారు. 

Also REad:ఆ క్వారీలను ఉమానే ప్రారంభించారు.. ఇప్పుడు నాపై నిందలా: మైనింగ్ వివాదంపై కృష్ణప్రసాద్ స్పందన

కాగా, బుధవారం దేవినేని ఉమకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఉమను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్ట్ పోలీసులను ఆదేశించింది. అంతకుముందు దేవినేని ఉమను హనుమాన్ జంక్షన్ సీఐ కార్యాలయం నుంచి జూమ్ కాల్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. ఉద్దేశ పూర్వకంగానే ముందస్తు ప్రణాళికతోనో మంగళవారం కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి ఉమ వెళ్లారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇలా జి.కొండూరులో అలజడికి దేవినేని ఉమే కారణమని...  అందువల్లే ఆయనను అరెస్ట్ చేసినట్లు కృష్ణా జిల్లా పోలీసులు తెలిపారు. 
 

click me!