టీడీపీకి దేవినేని అవినాష్ రాజీనామా

By Nagaraju penumalaFirst Published Nov 14, 2019, 1:35 PM IST
Highlights


ఇప్పటికే వల్లభనేని వంశీమోహన్ రాజీనామాతో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. వంశీ రాజీనామాను అంశంపై కోలుకోక ముందే దేవినేని అవినాష్ రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు.  

గుంటూరు: తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. 

ఇకపోతే గత కొద్దిరోజులుగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు దేవినేని అవినాష్. టీడీపీలో తగిన గౌరవం లభిచండం లేదంటూ పలుమార్లు వాపోయారు కూడా. అటు దేవినేని నెహ్రూ అభిమానులు సైతం టీడీపీలో తమకు అవమానం జరుగుతుందంటూ ఆరోపించారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం గుణదలలోని తన స్వగృహంలో దేవినేని నెహ్రూ అనుచరులు, అభిమానులతో భేటీ అయ్యారు అవినాష్. కార్యకర్తలు, దేవినేని నెహ్రూ అభిమానులు అంతా అవినాష్ కు టీడీపీలో జరుగుతున్న అవమానాలను ఎత్తిచూపారట. పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని, కనీసం గౌరవించడం లేదని మండిపడ్డారు.   

అలాగే నెహ్రూ అభిమానులకు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు లేదని అవినాష్ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో ఉంటూ అవమానాలను ఎదుర్కొనే కన్నా వైసీపీలో ఉంటే మంచిదని అవినాష్ కు సూచించారు.   

అభిమానులు, కార్యకర్తల అభిప్రాయమే తన అభిప్రాయమని సమావేశంలో స్పష్టం చేసిన దేవినేని అవినాష్ గురువారం టీడీపీకి రాజీనామా చేశారు. దేవినేని అవినాష్ వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. 

సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. గన్నవరం నియోజకవర్గంలో జరిగే ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ బరిలోకి దిగుతారంటూ ప్రచారం జరుగుతుంది.  

ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇసుక దీక్ష చేస్తున్నారు. విజయవాడలోని అలంకార్ సెంటర్ సమీపంలో ఇసుక కొరతను నిరసిస్తూ, ఉచిత ఇసుకను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షకు దిగారు. 

చంద్రబాబు నాయుడు చేపట్టిన ఇసుక దీక్ష పూర్తి కాక ముందే తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు దేవినేని అవినాష్. దేవినేని అవినాష్ రాజీనామాతో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లేనని తెలుస్తోంది. 

ఇప్పటికే వల్లభనేని వంశీమోహన్ రాజీనామాతో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. వంశీ రాజీనామాను అంశంపై కోలుకోక ముందే దేవినేని అవినాష్ రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు.  

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీలోకి అవినాష్.. వల్లభనేని వంశీ అలక....? కారణమేమిటంటే!
 

click me!