Cyclone Gulab:భారీ వర్షాలు...వరదనీటితో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్లమార్గం(వీడియో)

By Arun Kumar PFirst Published Sep 27, 2021, 2:37 PM IST
Highlights

గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం ఆలయం వద్ద వరదనీటి ప్రవాహం జలపాతాన్ని తలపిస్తోంది. 

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను తీరం దాటి బలహీనపడ్డా ఆంధ్ర ప్రదేశ్ లో వర్షభీభత్సం కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం దేవాలయ ప్రాంగణంలోకి కూడా వర్షపు నీరు చేరింది.  

ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్లో ఒకటి రెండు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే స్పందించిన ఆలయ అధికారులు బండరాళ్లను తొలగించారు. భారీ వర్షాలు , ఈదురు గాలులు కొనసాగుతున్న నేపథ్యంలో సింహగిరిపైకి వచ్చే  భక్తులు  తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులు హెచ్చరించారు. 

భారీ వర్షాలు, ఈదురు గాలుల ప్రభావం నేపథ్యంలో సింహాచలం దేవస్థానానికి వచ్చే భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ ఈవో ఎంవీ సూర్యకళ సూచించారు.  సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మినహా మిగతావారు స్వామి దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. సొంత వాహనాలపై వచ్చే వారు జాగ్రత్తగా రావాలన్నారు. కొండపై మాన్యువల్‌గా టికెట్లు అమ్ముతున్నారని.. భక్తుల సహకరించాలని ఈవో కోరారు.

వీడియో

తుఫాను కారణంగా విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని ఈవో తెలిపారు. కాబట్టి భక్తులు ఆలయ అధికారులకు సహకరించి తగు జాగ్రత్తలు తీసుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలని ఈవో భ్రమరాంబ సూచించారు.

read more  Cyclone Gulab:ఏపీలో వర్ష భీభత్సం... మృతికి రూ.5లక్షలు, బాధితులకు వెయ్యి: సీఎం జగన్ ప్రకటన

విశాఖలోని గోపాలపట్నం పరిసర ప్రాంతాలైన ఎల్లపువానిపాలెం, శ్రీదుర్గా నగర్, భగత్ సింగ్ నగర్, పరదేశమ్మ నగర్ తదితర కాలనీలన్నీ నీటమునిగాయి. పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి ఈ ప్రాంతంలో 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రం కూడా పూర్తిగా నీట మునిగి పోయింది.  

పెదగంట్యాడ మండలం బర్మాకాలనిలో పరిస్థితి ప్రమాదకరంగా వుంది. హెచ్ .బి.కాలని, బర్మాకాలని, డైరికాలని, రిక్షాకాలని, రామచంద్రానగర్ కాలనీలు నీటమునిగాయి. తమను అదికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
 

click me!