Cyclone Gulab : ఏపీలో ఇద్దరు మత్స్యకారులు మృతి, ఒకరు గల్లంతు..

By AN TeluguFirst Published Sep 27, 2021, 9:47 AM IST
Highlights

మరో ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఆ తరువాత తీరానికి సమీపంలోని అక్కుపల్లి గ్రామం నుండి రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి ఎస్ అప్పల రాజుకు ఫోన్ చేసి తాము సురక్షితంగా ఉన్నామని సమాచారం అందించారు. 

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లాకు చెందిన ఇద్దరు మత్స్యకారులు ఆదివారం సాయంత్రం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను(Cyclone Gulab)లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు( killed), మరొకరు గల్లంతయ్యారు(missing).

మరో ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఆ తరువాత తీరానికి సమీపంలోని అక్కుపల్లి గ్రామం నుండి రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి ఎస్ అప్పల రాజుకు ఫోన్ చేసి తాము సురక్షితంగా ఉన్నామని సమాచారం అందించారు. ఇదే సమయంలో, ఐఎండీ తుఫాను హెచ్చరికలను తీవ్రం చేసింది.తుఫాను తీరం దాటడం ప్రారంభించిందని, రాబోయే మూడు గంటల్లో తుఫానుగా కళింగపట్నానికి ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో తీరాన్ని దాటుతుందని ఐఎండీ తెలిపింది. 

పలాసకు చెందిన ఆరుగురు మత్స్యకారులు రెండు రోజుల క్రితం ఒడిశాలో కొత్త పడవ కొనుక్కున్నారు. తరువాత దాంట్లోనే సముద్రం మీదుగా స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ సమయంలోనే తుఫానులో చిక్కుకున్నారు. తుఫానులో చిక్కుకున్న తరువాత ఆరుగురిలో ఒకరు తన గ్రామానికి ఫోన్ చేసి, తమ పడవ బ్యాలెన్స్ కోల్పోయిందని, తనతో పాటున్న మిగతా ఐదుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారని సమాచారం ఇచ్చారు. 

ఆ తరువాత కాసేపటికి అతని మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయిపోయింది. దీంతో అతను కూడా కనిపించకుండా పోయాడని తేలింది. అయితే, గల్లంతైన వారిలో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు ఈదుకు రాగా, మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

మొదటి ఫోన్ చేసిన వ్యక్తి జాడ ఇంకా తెలియరాలేదు. అతను ఇంకా పడవలో చిక్కుకుని ఉండవచ్చని అతని తోటి మత్స్యకారులు భయపడుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి మత్స్యశాఖ మంత్రి నేవీ అధికారులను సంప్రదించారు.

Cyclone Gulab: తప్పిన ముప్పు... తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ తుఫాను

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మూడు ఉత్తర తీర జిల్లాలలో గులాబ్ ప్రభావంతో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం నుండి 85 కిలోమీటర్ల దూరంలో గులాబ్ కేంద్రీకృతమై ఉందని, అర్ధరాత్రి సమయంలో కళింగపట్నం, గోపాల్‌పూర్ (ఒడిశాలో) మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు.

విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. వారిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. NDRF, SDRF బృందాలు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల కోసం మూడు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో, వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన 182 మందిని సహాయక శిబిరాలకు తరలించినట్లు కలెక్టర్ ఎల్. శ్రీకేశ్ బాలాజీ రావు తెలిపారు. ఇదిలా ఉండగా, విజయవాడ-హౌరా మార్గంలో ఎనిమిది రైళ్లను ఖరగ్‌పూర్, జార్సుగూడ, బిలాస్‌పూర్, బల్హర్షా మీదుగా మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఆదివారం బయల్దేరాల్సిన మరో రెండు రైళ్లు సోమవారానికి షెడ్యూల్ చేయబడ్డాయి.

click me!