దారుణం..రోజుల పసికందుకి వాతలు పెట్టిన తల్లి

By ramya NFirst Published Feb 6, 2019, 11:26 AM IST
Highlights

చెడు జరగకూడదంటూ పుట్టి పదిరోజులు కూడా గడవని ఓ పసికందుకు వాతలు పెట్టారు. దీంతో.. చిన్నారి పరిస్థితి విషమంగా మారింది.

సాంకేతికంగా ఒకవైపు ప్రపంచం ముందుకు దూసుకుపోతుంటే.. ఇంకా కొందరు మూఢనమ్మకాలపై విశ్వాసాన్ని వీడటం లేదు. ఇందుకు నిదర్శనం విజయనగరం జిల్లాలో తాజాగా జరిగిన ఓ సంఘటన.  చెడు జరగకూడదంటూ పుట్టి పదిరోజులు కూడా గడవని ఓ పసికందుకు వాతలు పెట్టారు. దీంతో.. చిన్నారి పరిస్థితి విషమంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పాచిపెంట మండలం ఊబగుడ్డి గ్రామానికి చెందిన పాడి నర్శమ్మ గర్భిణి. నెలలు నిండటంతో సాలూరులోని గర్భిణుల వసతిగృహంలో ఇటీవల ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది.

 శిశువు పుట్టిన ఐదో రోజునే కడుపు, చేతులపైన కుటుంబ సభ్యులు సూది కాల్చి వాతలు పెట్టారు. రెండురోజుల తర్వాత కూడా గాయాలు తగ్గకపోవడంతో మంగళవారం సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. మంగళవారానికి శిశువు వయసు 11 రోజులకు చేరినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఎస్‌ఎంసీయూ యూనిట్‌లో శిశువుకు వైద్య సేవలందిస్తున్నారు. ప్రాణాపాయ స్థితి లేదని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. ఊబగుడ్డిలో పిల్లలు పుడితే వాతలు పెట్టడం ఆచారమని, అందుకే తామూ అలాగే చేశామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

click me!