
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి వ్యవహారంపై ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. లిక్కర్ మాఫియాతో సీఎం జగన్కు సంబంధాలు వున్నాయని ఆయన ఆరోపించారు. శరత్ చంద్రారెడ్డి స్వయంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి బంధువని.. అతని నుంచి జగన్కు భారీగా నిధులు అందాయని రామకృష్ణ వ్యాఖ్యానించారు. శరత్ చంద్రారెడ్డి నుంచి రూ.9 వేల కోట్లను జగన్ తీసుకున్నారని ఆయన ఆరోపించారు. విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేసేందుకు జగన్ కష్టపడుతున్నారని రామకృష్ణ సెటైర్లు వేశారు. తన అక్రమ కేసుల నుంచి బయటపడేందుకు మోడీ ముందు జగన్ తలవంచుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇకపోతే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ రిమాండ్ డైరీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందో ఈడీ అందులో వివరించింది. అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి రూ.64 కోట్ల వరకు మనీలాండరింగ్కు పాల్పడ్డాడని ఈడీ తెలిపింది. లంచాలు ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాడని తెలిపింది. స్కామ్లో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రోలు కీలకపాత్ర పోషించినట్లు తేల్చింది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 169 చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. లిక్కర్ స్కామ్లో 34 మంది పాత్ర బయటపడిందని ఈడీ వెల్లడించింది. 6 రిటైల్ జోన్ల కోసం పెద్ద మొత్తంలో ముడుపులను ఇచ్చినట్లు పేర్కొంది. రూ. 100 కోట్ల వరకు లంచాలు ఇచ్చినట్లు తెలిపింది. డిజిటల్ డివైజస్తో పాటు రికార్డులు సీజ్ చేశామని ఈడీ స్పష్టం చేసింది. 34 మంది నిందితులు 140 ఫోన్లు మార్చారని.. లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే ఫోన్లు మార్చినట్లు తెలిపింది. సెల్ఫోన్లు మార్చడం కోసం రూ.1.20 కోట్లు ఖర్చు చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.
మరోవైపు... శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలోనూ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు మద్యం వ్యాపారి వినయ్ బాబులను ఈడీ అధికారులు గురువారం అరెస్ట్ చేసి.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. వీరిని కస్టడీకి అనుమతించాలని ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని కోరగా.. కోర్టు వారం రోజుల కస్టడీకి అనుమతించింది. అయితే కొన్ని షరతులను కూడా విధించింది. 24 గంటలకు ఒకసారి నిందితులకు వైద్య పరీక్షలు చేయించాలని.. అలాగే సీసీటీవీ పర్యవేక్షణలో వీరిని ప్రశ్నించాలని సూచించింది.