మద్యం మత్తుకు బలైన రెండు నిండు ప్రాణాలు, భార్యా భర్తల ఆత్మహత్య

First Published Jul 4, 2018, 10:47 AM IST
Highlights

జయశంకర్ జిల్లాలో విషాదం...

మద్యానికి బానిసైన భర్త వేధింపులు తట్టుకోలేక ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడింది.  దీంతో భయపడిపోయిన భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా రెండు నిండు ప్రాణాలను మద్యం మత్తు బలితీసుకుంది. ఈ విషాద సంఘటన  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని గోవిందరావు పేట మండల కేంద్రంలో ఆత్మకూరి ప్రసాద్, స్వరూప దంపతులు నివసిస్తున్నారు. వీరికి నందిని, అజయ్ ఇద్దరు సంతానం. అయితే భార్య కూలీపనులకు వెళుతుండగా, భర్త స్థానికంగా ఓ వెల్డింగ్ షాప్ లో పనిచేస్తుండేవాడు. 

అయితే మద్యానికి బానిసైన ప్రసాద్ నిత్యం తాగి వచ్చి భార్యను కొట్టడంతో పాటు ఇంట్లోని వస్తువులను ద్వంసం చేసేవాడు. ఇలా నిన్న ఫుల్లుగా మద్యం తాగి వచ్చి భార్యతో గొడవకు దిగాడు.  భర్త ప్రవర్తనతో విసుగు చెందిన స్వరూప ఇంటి పక్కనే వున్న చెట్టుకు తన చీరతో ఉరేసుకుంది.

ఆమె ఉరేసుకోవడాన్ని గమనించిన ప్రసాద్ కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె అప్పటికే మఈతిచెందింది. దీంతో భయాందోళనకు గురైన భర్త ఇంట్లో ఉరేకులకోసం వేసిన ఇనుప రాడ్డుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషాద సంఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ములుగు ఆస్పత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

click me!