హోం క్వారంటైన్ పర్యవేక్షణకై జియో ఫెన్సింగ్ టెక్నాలజీ...దేశంలోనే మొదటిసారి: ఏపి డిజిపి

By Arun Kumar PFirst Published Apr 24, 2020, 12:23 PM IST
Highlights

కరోనా కట్టడిలో భాగంగా హోం క్వారంటైన్ పర్యవేక్షణను  ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా జియో ఫెన్సింగ్ టెక్నీలజీని ఉపయోగించినట్లు ఏపి డిజిపి వెల్లడించారు. 

అమరావతి: కరోనా కట్టడికి అలుపెరగకుండా పనిచేసిన ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సాంకేతికత బృందాన్ని డిజిపి గౌతమ్ సవాంగ్  అభినందించారు. కరోనా మహమ్మారి నుండి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో పోలీసు శాఖ అన్ని చర్యలను తీసుకొంటోందన్నారు. వివిధ దేశాల నుండి ఏపీకి వచ్చిన వారిపై నిఘా కోసం అత్యంత సాంకేతికత పరిజ్ఞానం వినియోగించామని డిజిపి వెల్లడించారు.

దేశంలోనే మొదటిసారిగా హోం క్వారంటైన్ యాప్ ద్వారా జియో ఫెన్సింగ్ టెక్నాలజీ తో కరోనా అనుమానితులను పర్యవేక్షించామని తెలిపారు. ఇలా విదేశాల నుండి వచ్చిన 22,478 మందిపై ఇరవై ఎనిమిది రోజులపాటు నిఘా ఏర్పాటు చేశామన్నారు. జియో ఫెన్సింగ్ టెక్నాలజీ నిబంధనలు ఉల్లంఘించిన 3043 మందిపై కేసులు నమోదు చేశామన్నారు.

ఇరవై ఎనిమది రోజుల హోం క్వారంటెన్ పూర్తి కావడంతో వారిపైన ఉన్న ప్రత్యేక ఆంక్షలను తొలగిస్తున్నామని  తెలిపారు. యాప్ ద్వారా అత్యధికంగా తూర్పు గోదావరి, విశాఖ పట్నం జిల్లాలలో ఎక్కువ మందిపై నిఘా పెట్టామన్నారు. వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు సాధారణ ప్రజలతో కలసి బయట తిరిగేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామని డిజిపి వెల్లడించారు.

రెడ్ జోన్ ప్రాంతాల వారిపై నిఘాకోసం సాంకేతికత పరిజ్ఞానంతో మరో  మొబైలు యాప్ సిద్ధం చేస్తున్నామన్నారు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తులు పోలీస్ శాఖ కు సహకరించడం వారి దేశ భక్తికి నిదర్శనమని...కరోనా కట్టడికి సహకరించిన వారికి సర్వదా రుణపడి ఉంటామని డిజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. 


 

click me!