
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్లాన్పై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్ధృతంగా వ్యాక్సినేషన్ చేపట్టాలని... నాలుగు, ఐదు వారాల్లో కోటి మందికి కోవిడ్ వ్యాక్సిన్స్ అందించాలని సీఎం ఆదేశించారు. మున్సిపల్ మరియు కార్పోరేషన్ ఎన్నికలు పూర్తయినందున సోమవారం నుంచి అర్భన్ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ చేపట్టాలని ఆదేశించారు. రూరల్ ఏరియాలో పైలట్ ప్రాజెక్టుగా మండలంలో వారంలో నాలుగు రోజులు, రోజుకు 2 గ్రామాలు చొప్పున వ్యాక్సినేషన్ అందించాలని సూచించారు.
''జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ మరో 6రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ ఎన్నికలు వెంటనే పూర్తయి ఉంటే వ్యాక్సినేషన్పై పూర్తి దృష్టిపెట్టేవాళ్లం. కాని అలా జరగలేదు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి? దీనివల్ల వ్యాక్సినేషన్కు అడ్డంకులు వచ్చే పరిస్థితి వుంది. అధికార యంత్రాంగంలో సందిగ్ధ వాతావరణం ఉంది. ఇలాంటి సందిగ్థత వాతావరణంలో మేమూ ఉన్నాం. ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఇలాంటి పరిస్థితులకు బాధ్యులు ఎవరు? అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. చాలా ఆవేదన కలుగుతోంది. ఏది ఏమైనా మనం చేయాల్సిన పని మనం చేయాలి.
వ్యాక్సినేషన్ను ఉద్ధృతం చేయండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే యజ్ఞం ముమ్మరంగా కొనసాగాలి'' అని అధికారులకు సీఎం ఆదేశించారు.
అర్బన్ ఏరియాలలో స్ధానిక ఎన్నికలు పూర్తయినందున సోమవారం నుంచే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. వీలైనంత త్వరగా విలేజ్ డాక్టర్ కాన్సెప్ట్ను అమల్లోకి తీసుకురావాలన్నారు. వ్యాక్సినేషన్ను పూర్తిస్థాయి యాక్టివిటీగా గ్రామాల్లో చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్లు, వలంటీర్లు, ఆశావర్కర్లు, హెల్త్ వర్కర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు.
''ప్రజల్లో చైతన్యానికి మరింత ప్రచారం నిర్వహించాలి. అందరూ వేసుకుంటున్నారా? లేదా? అనేది అక్కడికక్కడే పరిశీలన చేయాలి. వారికి అవగాహన కల్పించి అప్పుడే వ్యాక్సిన్ ఇచ్చేలా చేయాలి. పీహెచ్సీల్లో డాక్టర్ల కొరత లేకుండా చూసుకోవాలి. 104లతో అనుసంధానంగా ఉన్న డాక్టర్ల సంఖ్య సరిపోతున్నారా? లేదా చూసుకోవాలి.మండలానికి 2 పీహెచ్సీలు ఉండాలి, ఒక్కో పీహెచ్సీకి ఇద్దరు వైద్యులు ఉండాలి. అలాగే ప్రతి మండలానికి రెండు 104 వాహనాలు ఉండాలి. ఒక్కో వాహనంలో ఒక్కో డాక్టరు ఉండాలి. ఈ రకంగా మండలానికి 6గురు వైద్యులు ప్రతి మండలంలో ఉండాలి. నెలకు మూడు సార్లు ప్రతిగ్రామాన్నీ వైద్యుడు సందర్శించాలి'' అని జగన్ ఆదేశించారు.
''వైద్యుల నియామకంలో ఎలాంటి సంకోచాలు వద్దు. అవసరాలకు తగిన విధంగా డాక్టర్ల నియమాకాలు చేయాలి. దీనికి అవసరమైన నిధుల జారీలో ఎలాంటి అలక్ష్యం వద్దని ఆర్థిక శాఖ ఆధికారులను ఆదేశిస్తున్నా'' అని అన్నారు.
read more ఒకే స్కూళ్లో నలుగురు విద్యార్ధులకు కరోనా...ప.గో జిల్లా యంత్రాంగం అప్రమత్తం
హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు ఇంకా 3.97 లక్షల మందికి వ్యాక్సిన్ పెండింగులో ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. అలాగే 60 ఏళ్లకు పైబడి, మరియు 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 59.08 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్నారు. దీంతోపాటు ఏప్రిల్ 1 నుంచి 45ఏళ్లు పైబడ్డ వారందరికీ కూడా వ్యాక్సిన్ అందించడానికి కేంద్రం నిర్ణయం ప్రకటించిందని అధికారులు సీఎంకు వివరించారు.
''కోవిడ్ నిర్ధారణ పరీక్షలన్నీ ఆర్టీపీసీఆర్ పద్ధతిలోనే చేయాలి. కోవిడ్ సోకిన వారికి వైద్య సేవలను అందించడానికి గతంలో ఉన్న సదుపాయాలన్నీ కొనసాగాలి. 104 నంబర్కు కాల్ చేస్తే వైద్యసేవలు సమర్థవంతంగా అందేలా చూడాలి. ప్రస్తుతం 5వేల బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, అవసరాలకు అనుగుణంగా అదనపు బెడ్లు అందుబాటులోకి తీసురావాలి. ఏయే ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయన్న దానిపై దృష్టిపెట్టాలి. మిగతావాటితో పోలిస్తే పాఠశాలల్లో కేసులు సంఖ్య చాలా స్వల్పంగా వుంది. ఏదైనా స్కూళ్లో కేసులు వస్తే... 3 రోజలుపాటు నిలిపేసి అందరికీ పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే తిరిగి నడిపేందుకు అనుమతించాలి'' అని జగన్ అధికారులను ఆదేశించారు.