నకిలీ చలాన్ల కుంభకోణం: సీఎం జగన్ ఆరా, సమగ్ర దర్యాప్తుకు ఆదేశం

By Siva KodatiFirst Published Aug 13, 2021, 3:14 PM IST
Highlights

నకిలీ చలాన్ల కుంభకోణంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. అక్రమాలకు పాల్పడిన వారి నుంచి సొమ్ము రికవరీపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 
 

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చలాన్ల కుంభకోణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు. ఇప్పటికే రూ.40 లక్షలకు పైగా రికవరీ చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ శాఖలో కొత్త సాఫ్ట్‌వేర్ వినియోగిస్తున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్‌వేర్‌ను ఎన్ఐసీ, సీఎఫ్‌ఎంఎస్‌లకు అనుసంధానం చేయనున్నారు. 

Also Read:నకిలీ చలానాల స్కామ్: ఏపీ వ్యాప్తంగా తనిఖీలు.. ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లు సస్పెన్షన్ , సీఐడీ చేతికి విచారణ

మరోవైపు ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వెలుగుచూసిన బోగస్ చలానాల స్కామ్‌పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మంత్రి ధర్మాన కృష్ణదాస్ త్వరలోనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అక్రమాల వెలికితీతకు విజిలెన్స్ లేదా సీఐడీకి కేసును అప్పగించే అవకాశం వుంది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ఏడాది నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు 5.5  కోట్ల అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. పది కోట్ల వరకు అక్రమాలు జరిగి వుండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశారు. ఇవాళ లేదా రేపు విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేసే అవకాశం వుంది. డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై కొంతమంది సబ్ రిజిస్ట్రార్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. 
 

click me!