ఏపీలో కరోనా వ్యాక్సినేషన్... లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్ (వీడియో)

By Arun Kumar PFirst Published Jan 16, 2021, 1:11 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి మొట్టమొదటి కరోనా టీకాను వైద్యులు వేశారు. అనంతరం హెల్త్‌వర్కర్ నాగజ్యోతికి వ్యాక్సిన్ ఇచ్చారు.

విజయవాడ: యావత్ దేశాన్ని పట్టి పీడించిన కరోనాను తరిమికొట్టే బృహత్తర కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ(శనివారం) శ్రీకారంచుట్టాయి. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. విజయవాడ జీజీహెచ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి తొలి టీకాను వైద్యులు వేశారు. అనంతరం హెల్త్‌వర్కర్ నాగజ్యోతికి వ్యాక్సిన్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్‌ వేయనున్నారు. విజయవాడలోని గన్నవరం వ్యాక్సిన్‌ స్టోర్‌ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను పంపిణీ  చేశారు.

తొలుత జిజిహెచ్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కి డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని ), దేవాదాయ శాఖ మంత్రి  వెలంపల్లి శ్రీనివాసరావు , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఆదిత్యనాధ్ దాస్ , ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి  అనిల్ కుమార్ సింఘాల్ , కమీషనర్ కె భాస్కర్ , జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం సీఎంకు ఆరోగ్య శాఖ  ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ , కమిషనర్ కె.భాస్కర్ లు కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను, సాంకేతిక అంశాలను వివరించారు. 

వీడియో

కేవలం ఒక్క విజయవాడలోనే కాదు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యింది. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వాక్సినేషన్ కేంద్రాలను మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కృష్ణా జిల్లాలో 40వేల మందికి సరిపడా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఒక్క మచిలీపట్నంలోనే ఇవాళ 470మందికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామన్నారు.

తొలిదశలో ముందు వరుస కార్మికులకు టీకా ను అందుబాటులో ఉంచామన్నారు. ఒక డోస్ వేసుకున్న 28రోజుల తరువాత మరో డోసు తీసుకోవలసి ఉంటుందన్నారు. మొదటగా మచిలీపట్నం రూరల్ తాళ్లపాలెం వాక్సినేషన్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తో పాటు రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఏపీలో మాదిరిగానే తెలంగాణలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది.  హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాక్సినేషన్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మొదటి కరోనా టీకాను సఫాయి కర్మచారి ఎస్ కృష్ణమ్మకు అందించారు డాక్టర్లు. 


  

click me!