పొత్తులపై సీఎం జగన్ క్లారిటీ.. మారీచులు, రాక్షసులతో యుద్దం చేస్తున్నామని కామెంట్..

By Sumanth KanukulaFirst Published Nov 30, 2022, 3:24 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలలో వైసీపీ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలలో వైసీపీ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విద్యా దీవెన పథకం జూలై- సెప్టెంబర్ త్రైమాసికం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. తాను ప్రజలను, దేవుడిని మాత్రమే నమ్ముకున్నానని సీఎం జగన్ అన్నారు. తనకు ఎవరితో పొత్తు లేదని.. జనంతోనే తన పొత్తు అని స్పష్టం చేశారు. 

నవరత్నాలతో పేదలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ బటన్ నొక్కడం ద్వారా ప్రజలకు మంచి జరిగితే.. వాళ్లకు పుట్టగతులు ఉండవని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ బటన్ నొక్కితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెబుతారు.. ఇదే రాష్ట్రం వీళ్లు అధికారంలోకి ఉన్నప్పుడు మాత్రం అమెరికా అంటా అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. పేదలు బాగుపడటం తట్టుకోలేక పెత్తందారులు దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకోవాలని కోరారు. ఇంట్లో మంచి జరిగితే జగనన్నకు తోడుగా ఉండాలని అన్నారు. మారీచులతో, రాక్షసులతో, చెడిపోయిన వ్యవస్థతో యుద్దం చేస్తున్నామని అన్నారు. 

‘‘నాకు చంద్రబాబు మాదిరిగా టీవీ చానళ్లు, పేపర్లు, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు గానీ.. మీ బిడ్డకు నిజాయితీ ఉంది. ఏదైతే చెబుతానో.. అది తప్పకుండా చేస్తాను. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా భావించాను. మేనిఫెస్టోలో చెప్పిన 98 శాతం హామీలను అమలు చేసినట్టుగా చెప్పారు. గతంలో మేనిఫెస్టోలు చెత్తబుట్టలో ఉండేవి.. ఆ పరిస్థితిని మార్చిన వ్యక్తి మీ బిడ్డే. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకోచ్చాను. ఈ ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉండాలని  కోరుతున్నాను’’ అని సీఎం జగన్ అన్నారు. 

click me!