
తిరుపతి జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థులు వీరంగం సృష్టించారు. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి.. దాడులు చేసుకున్నారు. జిల్లాలోని గుడూరులోని ఆదిశంకర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే సీనియర్ విద్యార్థులు, కాలేజ్ సిబ్బంది జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. వివరాలు.. కాలేజ్లో చదువుతున్న కొందరు విద్యార్థులు రెండు గ్రూప్లు విడిపోయారు. వీరి మధ్య అమ్మాయిల విషయంలో గొడవల జరుగుతున్నాయి. అయితే తాజాగా ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.
ఇరువర్గాలకు చెందిన విద్యార్థులు కర్రలు, కత్తులతో దాడి చేసుకన్నారు. ఓ విద్యార్థి కత్తి పట్టుకుని బెదిరింపులకు దిగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాలేజ్ ఎదురుగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక, విద్యార్థుల గొడవ గురించి తెలుసుకున్న కాలేజ్ యజమాన్యం, కొందరు సీనియర్ విద్యార్థులు అక్కడి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ గొడవకు సంబంధించి పోలీసులు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఇక, గతంలో కూడా ఈ కాలేజ్లోని విద్యార్థుల మధ్య గొడవలు జరిగాయి. అయితే కాలేజ్ యజమాన్యం జోక్యం చేసుకుని సర్దిచెప్పింది.
ఇక, ఇటీవల తమిళనాడులో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కొయంబత్తూరు సమీపంలోని ఒండిపుదూర్ బస్టాండ్ వద్ద కొందరు విద్యార్థులు కొట్టుకున్నారు. తొలుత ఇద్దరు స్కూల్ విద్యార్థులపై కొందరు స్టూడెంట్స్ దాడి చేశారు. దీంతో మరి కొందరు జోక్యం చేసుకోవడంతో పెద్ద ఘర్షణకు దారి తీసింది. అంతా చూస్తుండగానే విద్యార్థులు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే విద్యార్థుల యూనిఫాం ఆధారంగా ప్రభుత్వ స్కూల్కు చెందిన విద్యార్థులుగా గుర్తించారు.