సివిల్ సర్వీసెస్ పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు... కలెక్టర్లకు కీలక ఆదేశాలు

By Arun Kumar PFirst Published Sep 25, 2020, 7:06 PM IST
Highlights

అక్టోబరు 4వ తేదీ ఆదివారం రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లోని 68 పరీక్షా కేంద్రాల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కు సంబంధించి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ వ్రాత పరీక్షలకు సంబంధిత జిల్లాల కలెక్టర్లు కోఆర్డినేటింగ్ సూపర్వైజరీ అధికారులుగా బాధ్యతలు అప్పగించింది ఏపి సర్కార్. 

అమరావతి: అక్టోబరు 4వ తేదీ ఆదివారం రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లోని 68 పరీక్షా కేంద్రాల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కు సంబంధించి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ వ్రాత పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్)ప్రవీణ్ ప్రకాశ్ తెలియజేశారు. 

ఈ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా సంబంధిత జిల్లాల కలెక్టర్లు కోఆర్డినేటింగ్ సూపర్వైజరీ అధికారులుగాను విశాఖపట్నం,విజయవాడ కేంద్రాల్లో ఇద్దరేసి సీనియర్ ఐఏఎస్ అధికారులు, తిరుపతి, అనంతపురం కేంద్రాలల్లో ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని పరిశీలకునిగా నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ వ్రాత పరీక్షలకు మొత్తం 30వేల 199 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.

అక్టోబరు 4వ తేదీ ఆదివారం ఉదయం 9.30గం.ల నుండి 11.30గం.ల వరకూ మరలా మధ్యాహ్నం 2.30గం.ల నుండి 4.30గం.ల వరకూ రెండు సెషన్లలో జరిగే ఈ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ వ్రాత పరీక్షలకు హాజరు కాబోయే అభ్యర్ధులు పరీక్ష ప్రారంభానికి గంట ముందు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలియజేశారు. 

read more   

ఇక పరీక్ష ప్రారంభానికి 10నిమిషాల ముందు ఆయా పరీక్షా కేంద్రాల గేటులను మూసి వేయడం జరుగుతుందని ఆ తర్వాత అభ్యర్ధులను లోనికి అనుమతించరని ఆయన స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లోనికి బ్యాగులు,మొబైల్ ఫోన్లు, ఐటి సంబంధిత వస్తువులు, ఇతర ఎలక్ట్రానిక్, కమ్యునికేషన్ సంబంధిత వస్తువులు వేటిని అనుమతించరని పేర్కొన్నారు. 

కరోనా మహమ్మారి నేపధ్యంలో పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్ధీ విధిగా మాస్క్ లేదా ఫేస్ కవర్ ధరించి మాత్రమే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ స్పష్టం చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల ప్రాంగణాలు, ప్రవేశ ద్వారాలు, పరీక్షా హాలుల్లోని టేబుళ్ళు, కుర్చీలు, వాష్ రూమ్లు, మరుగు దొడ్లను పూర్తిగా శానిటైజ్ చేయించాల్సిందిగా జిల్లా కలక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు. 

ప్రతి పరీక్షా హాల్ వద్ద శానిటైజర్, ఫేస్ మాస్క్, గ్లవుజులు వంటివి అందుబాటులో ఉంచేలా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. అదే విధంగా పరీక్షా హాల్లో అభ్యర్ధికి అభ్యర్ధికి మధ్య 2 చదరపు మీటర్ల భౌతిక దూరం ఉండే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు. అంతేగాక ఆయా పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగే సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా జిల్లా కలక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు ముఖ్య కార్యదర్శి ప్రవీణ ప్రకాశ్ తెలియజేశారు.
   

click me!