చంద్రబాబుతో దోస్తీపై గుర్రు: కాంగ్రెసుకు చిరంజీవి రాంరాం

By pratap reddyFirst Published Nov 10, 2018, 10:34 AM IST
Highlights

చిరంజీవి తన కాంగ్రెసు సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోలేదని కూడా అంటున్నారు. అయితే, కాంగ్రెసుకు తాను దూరమైనట్లు కనీసం సంకేతాలు కూడా ఇవ్వలేదు. రాజకీయాల గురించి ఆయన మాట్లాడడం లేదు. ప్రస్తుతం సైరా సినిమాలో ఆయన బిజీగా ఉన్నారు. 

హైదరాబాద్: పార్టీ కార్యకలాపాలకు ఇప్పటికే దూరంగా ఉంటున్న మాజీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెసుకు అధికారంగా గుడ్ బై చెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెసు పొత్తుపై ఆయన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్నేహాన్ని ఆయన అనైతికమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

చిరంజీవి తన కాంగ్రెసు సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోలేదని కూడా అంటున్నారు. అయితే, కాంగ్రెసుకు తాను దూరమైనట్లు కనీసం సంకేతాలు కూడా ఇవ్వలేదు. రాజకీయాల గురించి ఆయన మాట్లాడడం లేదు. ప్రస్తుతం సైరా సినిమాలో ఆయన బిజీగా ఉన్నారు. 

మరో వైపు ఆయన తమ్ముడు జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారు. తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెసులో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన వెంట ఉన్న సి. రామచంద్రయ్య కూడా కాంగ్రెసులో చేరారు. అయితే, తెలుగుదేశంతో కాంగ్రెసు స్నేహాన్ని నిరసిస్తూ రామచంద్రయ్య పార్టీకి రాజీనామా చేశారు. రామచంద్రయ్య చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. దాంతో చిరంజీవికి చెప్పకుండా ఆయన కాంగ్రెసుకు రాజీనామా చేస్తారని అనుకోవడం లేదు. 

అదే సమయంలో ఇటీవలే వట్టి వసంత కుమార్ కూడా కాంగ్రెసుకు రాజీనామా చేశారు. వట్టి వసంత కుమార్, రామచంద్రయ్య ఇద్దరు కూడా జనసేనలో చేరే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. వారితో పాటు చిరంజీవి కూడా తమ్ముడితో చేతులు కలిపే అవకాశాలున్నాయని అంటున్నారు. 

అయితే, నెల క్రితం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చిరంజీవితో మాట్లాడినట్లు చెబుతున్నారు. అయితే, తాను కాంగ్రెసులో ఉంటాను లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చిరంజీవి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, చిరంజీవి రాజకీయ నిర్ణయంపై త్వరలో ఓ స్పష్టత వస్తుందని అంటున్నారు. 

click me!