
రాజమండ్రి :తనకు అల్లు రామలింగయ్యల (allu ramalingaiah)మధ్య మామా అల్లుళ్ల బంధంతో పాటు గురు శిష్యుల బంధం కూడా ఉందని సినీ నటుడు చిరంజీవి (chiranjevi)చెప్పారు.అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాజమండ్రిలో శుక్రవారం నాడు అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. ఆ తర్వాత అల్లు రామలింగయ్య హోమియో ఆసుపత్రిని(homeo hospital) ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నటుడిగా తనకు జన్మనిచ్చింది రాజమండ్రి అని చిరంజీవి చెప్పారు. తాను నటించిన తొలి రెండు మూడు సినిమాలు రాజమండ్రి చుట్టు పక్కలే షూటింగ్ జరిగిందని ఆయన గుర్తు చేసుకొన్నారు.
రాజమండ్రిలోని మన ఊరి పాండవులు సినిమా షూటింగ్ సందర్భంగా అల్లు రామలింగయ్యతో తొలి సారిగా పరిచయం ఏర్పడిందని ఆయన గుర్తు చేసుకొన్నారు. అల్లు రామలింగయ్యకు తెలియని విషయం ఉండదని ఆయన చెప్పారు.అనుకొన్నది సాధించడానికి అల్లు రామలింగయ్య ఎంతగానో కష్టపడేవాడని చిరంజీవి గుర్తు చేశారు. నటుడిగా బిజీగా ఉంటూనే ఆయన హోమియో పై పరీక్షలు రాసి సర్టిఫికెట్ పొందాడని చిరంజీవి ఈ సందర్భంగా ప్రస్తావించారు.తమ కుటుంబ సభ్యులంతా హోమియో మందులే వాడుతామని చిరంజీవి చెప్పారు. జబ్బు గురించి సరిగా చెబితే హోమియోలో మంచి మందులున్నాయని చిరంజీవి వివరించారు.