తెలుగుదేశం కర్నూలు జిల్లా పార్టీ నాయకుల మధ్య విభేదాలు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరోసారి తలనొప్పిగా మారాయి.
విజయవాడ: తెలుగుదేశం కర్నూలు జిల్లా పార్టీ నాయకుల మధ్య విభేదాలు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మరోసారి తలనొప్పిగా మారాయి. కర్నూలు పార్టీ నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు చంద్రబాబు చెంతకు చేరాయి.
అఖిలప్రియతోనే మరోసారి చంద్రబాబు తలనొప్పి వచ్చి పడింది. గత కొంతకాలంగా మంత్రి అఖిల ప్రియ, ఎమ్మెల్యే భుమా బ్రహ్మనందరెడ్డిపై బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు.
వారిద్దరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన ఇటీవల ఫిర్యాదు చేశారు. అమరావతిలోని సీఎం నివాసంలో శనివారం వారికి భేటీ ఏర్పాటైంది.
గతంలో బీసీ జనార్థన్ రెడ్డి సీఎంను కలిసి తన బాధను వివరించినట్లు తెలిసింది. వారి మధ్య విభేదాల కారణంగా మహానాడు, మినీ మహానాడు, కర్నూలులో ముఖ్యమంత్రి పర్యటనకు సైతం జనార్థన్ రెడ్డి డుమ్మా కొట్టారు.
గతంలో మంత్రి అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య విభేదాలు సీఎం వద్దకు చేరిన విషయం విదితమే.