ఇళ్లపట్టాలకు అడ్డుకాదు, వైసీపీ అవినీతికే వ్యతిరేకం: చంద్రబాబు

By narsimha lodeFirst Published Jul 7, 2020, 3:47 PM IST
Highlights

తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని టీడీపీ చీఫ్ చంద్రబాబు చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షల 37 వేల ఇళ్లను క్యాన్సిల్ చేసినట్టుగా ఆయన తెలిపారు.

అమరావతి: తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని టీడీపీ చీఫ్ చంద్రబాబు చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షల 37 వేల ఇళ్లను క్యాన్సిల్ చేసినట్టుగా ఆయన తెలిపారు.

కుప్పంలో పేదల ఇళ్లను కూల్చివేతపై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబునాయుడు మంగళవారంనాడు ప్రసంగించారు.

పేదల ఇళ్ల కోసం మనం పోరాటం చేస్తున్నాం. ఇళ్ళస్థలాల్లో అవినీతిపై పోరాడుతున్నట్టుగా ఆయన చెప్పారు.టిడిపి అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో పెద్దఎత్తున పక్కా ఇళ్ల నిర్మాణం ప్రారంభమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

పేదలు ఉండాల్సింది గుడిసెల్లో కాదు, పక్కా భవనాల్లో ఉండాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారన్నారు.టిడిపి పేదల ఇళ్ల నిర్మాణం దేశానికే నమూనా అయిందని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఉమ్మడి ఏపిలో 14లక్షల ఇళ్లు మాయం చేశారు, కట్టకుండానే బిల్లులు చేసుకున్నారు, 13జిల్లాలలోనే  అప్పట్లో రూ5వేల కోట్ల స్కామ్ లు చేశారని ఆయన ఆరోపించారు.టిడిపి 2.50 సెంట్లనుంచి 3సెంట్ల ఇళ్లస్థలాలు ఇస్తే ఇప్పుడు వైసిపి నాయకులు సెంటుకే తగ్గించారని చెప్పారు.

పేదల ఇళ్లు ఎందుకు కూల్చేశారో సమాధానం చెప్పాలి. పేదల హౌసింగ్ బిల్లులు ఎందుకు చెల్లించలేదో చెప్పాలి. పట్టణాల్లో ఉచితంగా ఇళ్లు ఎందుకివ్వలేదో జవాబివ్వాలన్నారు.

వైసిపి అధికారంలోకి వచ్చాక బీసీ, ఎస్సీ,ఎస్టీ అసైన్డ్ భూములన్నీ బలవంతంగా లాక్కున్నారని ఆయన ఆరోపించారు. ముంపు భూములు, స్మశానాలు, చెరువులు, అడవుల్లో ఇళ్లస్థలాలు ఇస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. కాకినాడలో మడ అడవులు, రాజమండ్రిలో ఆవ భూముల్లో భారీ కుంభకోణాలు చేశారు. పేదల ఇళ్లలో కూడా వైసిపి కక్కుర్తికి పాల్పడుతోందని బాబు విమర్శించారు. 

also read:మహిళలంటే టీడీపీకి ఉన్న ప్రేమ ఇదేనా?: వాసిరెడ్డి పద్మ

కరోనా కష్టాల్లో ఆదుకోకుండా కక్షసాధింపు చర్యలు చేపడతారా..? పేదలకు అండగా ఉన్నవాళ్లను జైళ్లకు పంపుతారా..అని ఆయన ప్రశ్నించారు.కరోనా వైరస్ నియంత్రణలో పూర్తిగా విఫలం అయ్యారన్నారు. 

 కక్ష సాధింపుపైనే వైసిపి నాయకుల దృష్టి పెట్టారు. ప్రశ్నించినవాళ్లపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.వైసిపి నాయకుల స్వార్ధం కోసం ప్రతి స్కీమ్ లో స్కామ్ లకు పాల్పడుతున్నారన్నారు.

ఒక్కో పట్టాకు రూ30వేలు, రూ60వేలు, రూలక్షా 10వేల చొప్పున బలవంతపు వసూళ్ల దందా చేస్తున్నారని చెప్పారు. ఇళ్ల పట్టాలకు టిడిపి అడ్డుపడుతోందన్న ఆరోపణలను ఆయన ఖండిచారు.పేదల ఇళ్ల పట్టాలకు మేము అడ్డం పడటం లేదు.. ఇళ్ల పట్టాల ముసుగులో మీరు చేసే అవినీతికి అడ్డుపడుతున్నామే తప్ప ప్రజలకు జరిగే మేలుకు తాము అడ్డుపడడం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కుప్పం హౌసింగ్ బాధితులు వీడియో కాన్పరెన్స్ లో చంద్రబాబుతో మాట్లాడారు. తమ డబ్బులతో కట్టుకున్న ఇళ్లను కూల్చేసినట్టుగా బాధితులు బాబు దృష్టికి తీసుకెళ్లారు. కుప్పం నియోజకవర్గంలో 8పంచాయితీలకు సంబంధించి రూ100కోట్లతో 27ఎకరాల భూమిని చదును చేసి పేదలకు 2వేల మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు.

జీ ప్లస్ 3 కింద ప్రత్యేక పథకం కింద ఇళ్లు మంజూరు చేశారని ఆయా ఇళ్లన్నీ వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని బాధితులు చంద్రబాబుతో వాపోయారు . ఇప్పుడు వైసిపి నాయకుల ఒత్తిళ్లతో వాటిని కూలగొట్టి బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. 
 

click me!