పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ వాళ్లు గెలిస్తే.. : చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Jan 31, 2021, 3:25 PM IST
Highlights

స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలిస్తే ఊళ్లన్నీ వల్లకాడుగా మారుతాయని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

అమరావతి : స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలిస్తే ఊళ్లన్నీ వల్లకాడుగా మారుతాయని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆదివారం నాడు ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి..? అనే దానిపై టీడీపీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో 175 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం పౌరులుగా మనందరి బాధ్యత అని బాబు సూచించారు. ఎటువంటి పరిస్థితులైనా  ఎదుర్కోడానికి సిద్దంగా ఉండాల్సిందిగా కోరారు.

ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోడానికి సిద్దంగా ఉండాలని.. బైండోవర్ కేసులు, అపహరణలతో అభ్యర్ధులను భయపెట్టాలని చూస్తే ధైర్యం ఎదుర్కొని ముందుకెళ్లాలని తెలుగు తమ్ముళ్లకు వెల్లడించారు.

వాలంటీర్ల ద్వారా ప్రలోభపెట్టాలని చూసే కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ఎక్కడికక్కడ ప్రతిచోటా ఫిర్యాదులు చేయాల్సిందిగా కోరారు. పంచాయితీ ఎన్నికలను ప్రతిఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని ఆయన సూచించారు.

 వైసీపీ గుండాల చేతుల్లోకి మన గ్రామాలు వెళ్తే ప్రతి పల్లెకు కన్నీరే మిగులుతోందన్నారు.సమర్ధులైన వాళ్లే సర్పంచులుగా ఎన్నికయ్యేలా చూడాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. 

టీడీపీ పాలనలో పచ్చదనంతో కళకళలాడిన పల్లెలను వైసీపీ కళావిహీనంగా చేసిందని ఆయన ఆరోపించారు. కక్షా కార్పణ్యాలకు వేదికలుగా గ్రామాలను వైసీపీ మార్చిందని ఆయన విమర్శించారు. 

హింస, విధ్వంసాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలపై దమనకాండకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.చివరికి దేవాలయాలపై కూడా దాడులకు తెగబడ్డారు. వీటన్నింటికీ గుణపాఠం చెప్పే అవకాశం ఈ ఎన్నికల రూపంలో వచ్చిందన్నారు. 

భవిష్యత్తులో నాయకులుగా ఎదిగే వేదికలు గ్రామ పంచాయితీలే. సర్పంచ్‌గా ఎన్నికై, ఆ తరువాత అంచెలంచెలుగా అసెంబ్లీకి, పార్లమెంటు స్థాయికి ఎదిగిన నాయకులను అనేకమందిని చూసినట్టుగా ఆయన గుర్తు చేశారు.

click me!