ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు మోడీకి థాంక్స్ చెప్పిన చంద్రబాబు!

By Sree sFirst Published Mar 27, 2020, 10:05 AM IST
Highlights

ప్రధాన మంత్రి పేదలను ఆదుకోవడం పై, వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. రైతులకు ఇలా ఖరీఫ్ లో ఇవ్వాల్సిన డబ్బులను కూడా ముందుగా ఇవ్వడం వారికి ఎంతో ఉపయుక్తకరమని, చంద్రబాబు కొనియాడారు. 

ప్రపంచమంతా కరోనా వైరస్ బారినపడి బయటపడలేక కొట్టుమిట్టాడుతుంది. అంతకంతకు పెరుగుతున్న కేసులు, మరణాలతో ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఏమి చేయాలో అర్థం కాక తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. 

వివరాల్లోకి వెళితే.... కరోనా దెబ్బకు ప్రపంచం కుదేలవుతోంది. భారతదేశం కూడా దీనికి అతీతం కాదు. ఈ వైరస్ ను దేశం నుండి తరిమికొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వైరస్ వల్ల లాక్ డౌన్ ప్రకటించడంతో చాలా మంది పేదలు, దినసరి కూలీలు ఉపాధిని కోల్పోయి ఆకలితో అలమటించాల్సి వస్తుందని చాలా మంది మేధావులు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే!

ఐదవరకే పేదలకు ఎటువంటి నష్టం కలిగించము అని చెప్పిన ప్రధాని, నేడు ప్రకటించిన ప్యాకేజిలో ఆ విషయాన్నీ కనబడేలా చేసారు. పేదల కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను 1,75,000 కోట్లను జారీ చేసిన విషయం తెలిసిందే. 

ఇలా ప్రధాన మంత్రి పేదలను ఇలా ఆదుకోవడం పై, వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. రైతులకు ఇలా ఖరీఫ్ లో ఇవ్వాల్సిన డబ్బులను కూడా ముందుగా ఇవ్వడం వారికి ఎంతో ఉపయుక్తకరమని, చంద్రబాబు కొనియాడారు. 

ఇకపోతే... సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలని, వాటిపైన ఆధారపడి ఎందరో జీవిస్తున్నారని మోడీకి విన్నవించారు చంద్రబాబు. మొత్తానికి ఏదైతేనేం మోడీ తీసుకున్న నిర్ణయానికి దేశంలో అందరి నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. నిన్న రాహుల్ గాంధీ కూడా ఈ విషయమై మోడీని అభినందించారు. 

గురువారం నాడు మధ్యాహ్నం కేంద్ర ఆర్ధిక శాక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆకలి చావులు లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందని ఆమె చెప్పారు. 

కరోనా వైరస్ నివారించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్న వారికి కేంద్రం ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టుగా ప్రకటించింది. ప్రభుత్వ శానిటేషన్ వర్కర్లు, ఆశా వర్కర్లకు, డాక్టర్లకు, పారా మెడికల్ సిబ్బందితో పాటు ఇతరులకు రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలో సుమారు 20 లక్షల మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 

వచ్చే మూడు మాసాల పాటు పేదలకు బియ్యం లేదా, గోధుమలను ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల చొప్పున ఉచితంగా అందించనున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద వీటిని అందిస్తామని కేంద్రం ప్రకటించింది. దేశంలోని 80 కోట్ల మందికి లబ్ది జరిగే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఇక రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు రూ. 2 వేలను జమ చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. దీని ద్వారా దేశంలోని 8.69 కోట్ల రైతులకు లబ్ది జరగనుందన్నారు మంత్రి.

వలస కార్మికులు, పేదలకు నగదు బదిలీతో పాటు ఆహార పదార్థాలను అందించనున్నట్టుగా ఆమె తెలిపారు. సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు వచ్చే మూడు మాసాలకు రెండు విడతలుగా వెయ్యి రూపాయాలను అందిస్తామని కేంద్రం ప్రకటించింది. దేశంలోని మూడు కోట్ల మందికి ఈ సహాయం అందిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న 20 కోట్ల మహిళల ఖాతాల్లో వచ్చే మూడు మాసాల పాటు ప్రతి నెల రూ.500 చొప్పున నగదును ఇస్తామని కేంద్ర మంత్రి చెప్పారు.

దేశంలోని బీపీఎల్ కుటుంబాలకు వచ్చే మూడు మాసాల పాటు మూడు ఎల్ పీ జీ గ్యాస్ సిలిండర్లను ఉచితంగా సరఫరా చేస్తామని కేంద్రం ప్రకటించింది.

స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రెట్టింపు రుణాలను అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలోని 7 కోట్ల మందికి ప్రయోజనం కలగనుందని కేంద్రం తెలిపింది.

దేశంలోని 3.5 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు ప్రయోజనం కల్గించేందుకు వీలుగా రూ. 31 వేల కోట్ల నిధిని ఉపయోగించుకోవాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. 

click me!