నెల్లూరు మైనర్ బాలిక మీద దాడి జరిగిన ఘటన మీద టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కఠిన శిక్షలతోనే మహిళలపై నేరాల అదుపుచేయవచ్చన్నారు. నారా లోకేష్ ట్వీట్ చేస్తూ ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? అంటూ జగన్ కు చురకలంటించాడు.
నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికపై ఒక దుర్మార్గుడు అత్యాచారానికి ప్రయత్నించి...ఆమె ప్రతిఘటించటంతో నోట్లో, ముఖం మీద యాసిడ్ పోసి..ఆపై గొంతు కోసిన ఘటన దిగ్భ్రాంతిని కలిగించిందని, ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
ఇంట్లో ఉన్నప్పటికీ ఏపీలో ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేదని ఇంకోసారి రుజువైందన్నారు. అత్యాచార ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు అమలుచేస్తే ఇటువంటి నేరాలు పునరావృతం కావని... వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీలో నేరాల రేటు పెరిగిందని జాతీయ గణాంకాలు మొన్ననే చెప్పాయని దుయ్యబట్టారు. ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ నేరాల నియంత్రణకు చిత్తశుద్ధితో పనిచేయక పోవడంతో నేరగాళ్ళ విచ్చలవిడితనం పెరిగిపోయిందన్నారు.
నెల్లూరులో యాసిడ్ దాడికి గురైన 9వ తరగతి విద్యార్ధిని: చెన్పై అపోలో ఆసుపత్రికి తరలింపు
నేరం చేసిన వైసీపీ రౌడీలను వెనకేసుకు రావడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిపైనా అక్రమకేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ, శాంతిభద్రతలు కాపాడటంలో ఎందుకు లేదు? అని ధ్వజమెత్తారు. బాలికపై ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాలికకు మెరుగైన వైద్యం అందించాలి. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని డిమాండ్ చేశారు.
ఇక ఈ ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? వైసీపీ అధినేత జగన్రెడ్డి గారు తల్లిని తరిమేసి, చెల్లిని గెంటేసి, బాబాయ్ని చంపేస్తే.. వైసీపీ కార్యకర్తలు ఊరుకుంటారా? ఇదిగో ఇలా ఊరుమీద పడి అన్నెంపున్నెం ఎరుగని బాలికలపై మానవత్వానికే మాయనిమచ్చలా దాడులకి తెగబడుతున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో 14 ఏళ్ల బాలికపై వైకాపా కార్యకర్త నాగరాజు లైంగికదాడికి యత్నించాడు.
బాలిక ప్రతిఘటించడంతో నోట్లో యాసిడ్ పోసి, గొంతు కోసి పరారయ్యాడు. ఈ దారుణానికి పాల్పడిన నాగరాజు వైసీపీ కార్యకర్త కావడంతో పోలీసులు ఏ కట్టుకథ అల్లుతారో? ఎంపీ గోరంట్ల మాధవ్ని రక్షించినట్టే రక్షిస్తారో? జగన్రెడ్డి సీఎం కావడంతోనే నేరస్తులు, దోపిడీదారులు, రేపిస్టులు ఇది తమ రాజ్యమన్నట్టు చెలరేగిపోతున్నారు. వైసీపీ దురాగతాలకు అడ్డుకట్ట పడకపోతే రాష్ట్రంలో ఆడపిల్లలు, మహిళలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నారాలోకేష్ మండిపడ్డారు.
ఇదిలా ఉండగా, సోమవారం నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం నక్కలకాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దుండగుడు బాలిక గొంతు కోసి, యాసిడ్ పోశాడు. దీంతో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. బాలికను నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. బాలికపై అత్యాచారయత్నం చేయడంతో బాలిక ప్రతిఘటించిందని దీంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.