
ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురానికి చెందిన రైతు నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయనను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేయని తప్పుకు సంక్రాంతి పండగ రోజున నరేంద్ర జైలులో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు నరేంద్రను అకారణంగా అరెస్టు చేసి.. జైలులో నిర్భంధించినందున వైసీపీ ప్రభుత్వం ఆయనకు క్షమాపణ చెప్పాలని అన్నారు. పండుగ వేళ సదరు అన్నదాత కుటుంబం క్షోభకు కారణమైన సర్కార్ను రైతులోకం క్షమించదని వ్యాఖ్యానించారు.
రైతు తాను పండించిన పంటకు మద్దతు ధర అడిగిన పాపానికి జైల్లో పెట్టి ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతోందని చంద్రబాబు అన్నారు. ఈ చర్య.. యావత్ రైతు సమాజాన్నేఅవమానించిందని అన్నారు. వినుకొండ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టినట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యిందని.. తప్పుడు కేసు పెట్టిన వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్ సస్పెండ్ అయ్యారని తెలిపారు. ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని వెంటనే రైతు నరేంద్రను విడుదల చెయ్యాలని, పండుగ పూట ఆయనను అరెస్టు చేసి.. వేధింపులకు గురిచేసినందుకు బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.