ఏపీ అసెంబ్లీ బహిష్కరణ:నాడు వైఎస్ జగన్, నేడు చంద్రబాబు

By narsimha lodeFirst Published Nov 19, 2021, 9:16 PM IST
Highlights

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది. రెండేళ్ల పాటు వైసీపీ సభ్యులు అసెంబ్లీకి దూరంగా ఉన్నారు. అయితే చంద్రబాబు మాత్రం తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రకటించారు.

అమరావతి: చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో వైసీపీ సభ్యులు అసెంబ్లీని బహిష్కరించారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని  ఆరోపిస్తూ వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు.  సీఎం అయ్యాకే వైఎస్ జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టారు.రెండేళ్లుగా తనకు అవమానం జరుగుతుందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రకటించారు. అసెంబ్లీలో కూడా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.  ఆ తర్వాత మీడియా సమావేశంలో కూడా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రకటించారు.

2014లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఈ సమయంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు.  వైసీపీ నుండి టీడీపీలో చేరిన వారికి  చంద్రబాబు సర్కార్ మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది.

2017 అక్టోబర్ 25న  అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని ycp శాసనసభపక్షం నిర్ణయం తీసుకొంది. వైసీపీ పార్టీ గుర్తుపై విజయం సాధించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ అసెంబ్లీని బహిష్కరించాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ కు ఫిర్యాదులు చేసినా కూడ ఈ విషయమై చర్యలు తీసుకోలేదని వైసీపీ  ఆనాడు ఆరోపించింది.

2014 ఎన్నికల్లో టీడీపీ 104 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి నాలుగు స్థానాలు దక్కాయి. వైసీపీ 67 స్థానాల్లో విజయం సాధించింది. అయితే 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ys jagan ను మాట్లాడనివ్వడం లేదని కూడా వైసీపీ ఎమ్మెల్యేలు  అభిప్రాయపడ్డారు.మరోవైపు నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. ఈ విషయమై రోజా కోర్టును కూడా ఆశ్రయించారు.సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా స్పీకర్ పట్టించుకోలేదని వైసీపీ ఆరోపించింది.

also read:చంద్రబాబు కంటతడి బాధాకరం... భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలు ఖండించాల్సిందే: పవన్

2019లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారాన్ని చేపట్టింది.  రెండేళ్లుగా ap assemblyలో తనను అవమానపరుస్తున్నారని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించి  అసెంబ్లీకి తాను ఇక నుండి హాజరు కాబోనని ప్రకటించారు. ఇది కౌరవ సభ అంటూ వ్యాఖ్యానించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతానని chandrababu శపథం చేశారు.

అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ నిర్ణయం తీసుకొన్న రెండేళ్ల తర్వాత సీఎంగా జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే ఏపీలో నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికలు జరగాలంటే మరో మూడేళ్లు ఆగాల్సిందే.ఇదిలా ఉంటే గతంలో ఎన్టీఆర్ కూడా అసెంబ్లీకి వెళ్లనని శపథం చేశారు. కానీ టీడీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిలదీసేవారు. 1994లో సీఎం అయ్యాకే ఎన్టీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టారు.అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారు. భవిష్యత్తులో రిగే సమావేశాలకు  అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని  నిర్ణయించారు.


 

click me!