కీలకమైన సమయంలో అలిగి పార్లమెంటుకు వెళ్లబోనని మొరాయించి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు.
అమరావతి: కీలకమైన సమయంలో అలిగి పార్లమెంటుకు వెళ్లబోనని మొరాయించి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన మొండిపట్టుకు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిగొచ్చారు.
అనంతపురంలో రోడ్ల వెడల్పునకు నిధులు విడుదల చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించింది. అందుకు 45.56 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ప్రధాని మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం లోకసభలో చర్చకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, విప్ జారీ చేసినా సరే తాను పార్లమెంటుకు వెళ్లబోనని జెసి మొరాయించి అనంతపురంలో తిష్ట వేశారు.
దాంతో చంద్రబాబు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని అమరావతికి పిలిపించి చర్చలు జరిపారు. ప్రభాకర్ చౌదరి అనంతపురం అభివృద్ధికి అడ్డుపడుతున్నారని జెసి బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రభాకర చౌదరితో మాట్లాడారు. ఆ తర్వాత అనంతపురం రోడ్ల వెడల్పునకు నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.