ఎప్పటిలోగా కడతారు, ఆ డీపీఆర్ ఇవ్వండి: పోలవరానికి కేంద్రం కొత్త కండీషన్లు

Siva Kodati |  
Published : Mar 25, 2022, 03:16 PM ISTUpdated : Mar 25, 2022, 03:18 PM IST
ఎప్పటిలోగా కడతారు, ఆ డీపీఆర్ ఇవ్వండి: పోలవరానికి కేంద్రం కొత్త కండీషన్లు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు కొత్తగా షరతులు పెట్టింది. ఎప్పటిలోగా కడతారో చెప్పాలని, అలాగే మరోసారి సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించాలని సూచించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం మ‌రికొన్ని ష‌రతులు పెట్టింది. ప్రాజెక్టు నిర్మాణం గురించి లోక్‌సభలో వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నల‌కు కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీని ప్రకారం.. డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌పై డీపీఆర్‌ తయారు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ నిబంధనలతో పాటు పోల‌వరానికి సంబంధించి మరోసారి సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 

ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రస్తుతానికి రూ.15,668 కోట్ల వరకే తమ బాధ్యతని కేంద్రం తేల్చిచెప్పింది. 2022, ఫిబ్రవరి వరకు ఏపీ స‌ర్కారు చేసిన ఖర్చు మొత్తం రూ.14,336 కోట్లని, తాము రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్ప‌టికే రూ.12,311 కోట్లు తిరిగి చెల్లించామని తెలిపింది. ఇంకా రూ.437 కోట్లకు పోలవరం అథారిటీ బిల్లులు పంపిందని తెలిపింది. అస‌లు పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తిచేస్తారో గడువు చెప్పాలని ఏపీ స‌ర్కారుని కేంద్ర ప్ర‌భుత్వం కోరింది. 

ఇకపోతే.. Polavaram projectను పూర్తి చేసి తీరుతామని ఏపీ సీఎం YS Jagan స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించబోమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తెచ్చుకున్నారని జగన్ ఆరోపించారు.మంగళశారం నాడు AP Assembly పోలవరంపై జరిగిన చర్చలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. 2023 ఖరీఫ్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. 

పోలవరం ప్రాజెక్టు పనులను ఇంత వేగంగా చేస్తున్నా కూడా ఇంతవరకు తాము ఇంతవరకు బస్సులు పెట్టలేదు, భజనలు చేయించలేదని జగన్ సెటైర్లు వేశారు. పోలవరం ప్రాజెక్టును YSR  ప్రారంభించారన్నారు. ఆ తండ్రికి కొడుకుగా ఈ ప్రాజెక్టును తాను పూర్తి చేస్తానని జగన్  స్పష్టం చేశారు.అంతేకాదు పోలవరం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు. ప్రాజెక్టు డిజైన్లు అనుమతి CWC  నుండి వస్తే ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేస్తామన్నారు. ఈ నెలఖారు నాటికి డిజైన్ అనుమతులు ఇస్తామని కేంద్రం కూడా హామీ ఇచ్చిందన్నారు.

తాము చేయలేని పనిని ఇంకొకరు చేస్తున్నారని చంద్రబాబుకు కడుపు మంటగా ఉందన్నారు సీఎం.తన స్వంత జిల్లాలో కూడా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని వ్యక్తి Chandrababu అంటూ జగన్ విమర్శించారు. చంద్రబాబు తప్పిదాలతోనే పోలవరం ప్రాజెక్టుకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు చెప్పుకోవడానికి కూడా ఒక్క ప్రాజెక్టు కూడా లేదని జగన్ చెప్పారు. పునరావాసంతో ఇతర విషయాలను పట్టించుకోకుండానే  కాపర్ డ్యామ్ ను చేపట్టారని జగన్  విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని ఓ వర్గం మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు మాత్రం తగ్గదన్నారు. కానీ చంద్రబాబు ఎత్తు మాత్రం తగ్గుతుందని ఆయన చెప్పారు. రోజు రోజుకు చంద్రబాబు ఎత్తు తగ్గి మరుగుజ్జు అవుతాడన్నారు. 2019 ఎన్నికల్లో  ప్రజలు చంద్రబాబుకు గట్టిగా బుద్ది చెప్పారని జగన్ గుర్తు చేశారు.అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా టీడీపీ ఓటమి పాలైందన్నారు. 2024 ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబు ఓటమి పాలౌతారని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. 

తాను విజనరి అని చెప్పుకొనే చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. 2013-14 ప్రాజెక్టు అంచనాల మేరకు ప్రాజెక్టు కడతామని చంద్రబాబు సర్కార్ గతంలో కేంద్రంతో ఒప్పందం చేసుకొందన్నారు.ఈ విషయాన్ని తాను విపక్షనేతగా ఉన్న సమయంలో కూడా నిలదీసినట్టుగా  జగన్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా అప్పట్లో తాను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ను జగన్ అసెంబ్లీలో ప్రదర్శించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Minister Kolusu Parthasarathy serious on Bhumana Karunakar Reddy | TDP VS YCP | Asianet News Telugu
విజయవాడ సంక్రాంతి వేడుకల్లో MP Kesineni Sivanath | Sankranthi Muggulu | Asianet News Telugu