పేదలందరికీ ఇళ్లు .. సింగిల్ జడ్జి తీర్పుపై రంగంలోకి కేంద్రం

By Siva KodatiFirst Published Oct 27, 2021, 9:42 AM IST
Highlights

‘‘పేదలందరికీ ఇళ్లు ’’ పథకం కింద 30 లక్షల మంది పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దన్న హైకోర్టు తీర్పుపై (ap high court) రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్‌లో కేంద్ర ప్రభుత్వం (govt of india) ఇంప్లీడ్‌ కానుంది. 

‘‘పేదలందరికీ ఇళ్లు ’’ పథకం కింద 30 లక్షల మంది పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దన్న హైకోర్టు తీర్పుపై (ap high court) రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్‌లో కేంద్ర ప్రభుత్వం (govt of india) ఇంప్లీడ్‌ కానుంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) (pmay) కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పీల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీల్‌లో ఇంప్లీడ్‌ అవుతామని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌ మంగళవారం హైకోర్టుకు తెలియజేశారు.

సింగిల్‌ జడ్జి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని, ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలుచేసి పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని చెప్పారు. ఇందుకు అనుమతివ్వాలని కోరారు. దీనికి ఉన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే దాన్ని పరిశీలించిన తరువాత అనుమతి విషయంలో తగిన ఉత్తర్వులు ఇస్తామని తెలియజేసింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దుచేయాలంటూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన అప్పీల్‌ గురించి మంగళవారం అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సీజే ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఈ వ్యవహారం 30 లక్షల మంది జీవితాలకు సంబంధించినదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే కోర్టు తీర్పు సర్టిఫైడ్‌ కాపీని కోర్టు ముందుంచామని, అత్యవసరం దృష్ట్యా ఈ వ్యాజ్యంపై త్వరితగతిన విచారణ చేపట్టాలని ఏఏజీ కోరారు. ఇది పీఎంఏవైతో ముడిపడి ఉన్నందున తమ అప్పీల్‌లో కేంద్రం ప్రతివాదిగా ఉండటం తప్పనిసరి అని తెలిపారు. 

Also Read:గృహ నిర్మాణాలపై ఏపీ సర్కార్‌కు మరోషాక్ ... హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్ట్

‘నవ రత్నాలు - పేదలందరికీ ఇళ్లు’ (navaratnalu pedalandariki illu) పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించుకుంది. దీనిపై  2019 డిసెంబరు 2న జారీ చేసిన 3,67,488 మార్గదర్శకాల జీవోలను సవాల్‌ చేస్తూ తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పట్టాలను కేవలం మహిళా లబ్ధిదారులకే కేటాయించడంపై అభ్యంతరం తెలిపారు. పారదర్శకంగా ఇళ్ల  స్థలాలు కేటాయించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. 

దీనిపై అక్టోబర్ 9న జరిగిన విచారణ సందర్భంగా ఈ పథకంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలు జారీ చేసింది. కేవలం మహిళల పేరిట మాత్రమే పట్టాలు ఇవ్వాలన్న విధానాన్ని తప్పుపట్టింది. సెంటు, సెంటున్నర స్థలాల్లో గృహ సముదాయాలు ఏర్పాటు చేస్తామనడంలో హేతుబద్ధతనూ ప్రశ్నించింది. దీనిపై... లోతైన అధ్యయనం అవసరమని తెలిపింది. అప్పటిదాకా ఈ పథకాన్ని అమలు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి శుక్రవారం ఈ కీలక తీర్పు వెలువరించారు. 

click me!