
AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రాజ్యసభలో బుధవారం ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై క్లారిటీ ఇవ్వాలంటూ.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధం నెలకొందని, 3 రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న తర్వాత రాజధాని ఏదో తెలియడం లేదని, ఏపీ రాజధాని ఏది? ఎవరు నిర్ణయం తీసుకోవాలి? అని రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు.
ఆయన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. తమ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఏపీకి రాజధాని అమరావతే అన్నారు. రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రప్రభుత్వానిదేనని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని స్పష్టం చేశారు.
పాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు, శాసన రాజధాని అమరావతి అని తర్వాత చెప్పారు. ఆ బిల్లులను వెనక్కి తీసుకున్నట్టు మేం కూడా వార్తల ద్వారా తెలుసుకున్నాం. మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే” అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు.