ఆంధ్ర ఆస్పత్రిపై కేసు: బ్లాక్ మార్కెట్లో కరోనా వ్యాక్సిన్, డాక్టర్ రాజు అరెస్టు

By telugu teamFirst Published May 15, 2021, 12:36 PM IST
Highlights

కరోనా చికిత్సలో అక్రమాలకు పాల్పడుతున్న ఏలూరు ఆంధ్ర ఆస్పత్రిపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. మరోవైపు కరోనా టీకాలను బ్లాక్ లో విక్రయిస్తున్న ప్రభుత్వ వైద్యుడు రాజును పోలీసులు అరెస్టు చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా చికిత్స పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై విజిలెన్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ కొరడా ఝళిపిస్తోంది. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు 13 ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహించారు. అక్రమాలకు పాల్పడిన 9ఆస్పత్రులపై కేసులు నమోదు చేశారు. 

రెమ్ డెసివర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న మరో ఐదు ఆస్పత్రుల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. శనివారంనాడు పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్ర ఆస్పత్రిపై కేసు నమోదు చేసారు. ప్రభుత్వ నిర్దేశించిన ధరల కన్నా ఎక్కువ వసూలు చేస్తునట్లు అధికారులు గుర్తించారు. 

దానికి తోడు 100 పడకలకు అనుమతి ఉండగా 130 పడకలను ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్సను నిరాకరించినట్లు వచ్చిన ఆరోపణపై కూడా ఆంధ్ర ఆస్పత్రి కేసు నమోదు చేశారు.  రమిడెసివిర్ దుర్వినియోగం జరిగినట్లు కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. 

ఇదిలావుంటే, విజయవాడలో కరోనా వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడలో కరోనా వ్యాక్సిన్ ను బ్లాక్ లో అమ్ముతున్న డాక్టర్ ఎంఎస్ రాజును పోలీసులు అరెస్టు చేశారు. అతను జీ కొండూరు ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్నాడు. 

రాజు నుంచి ఐదు కోవాగ్జిన్ టీకాలను, ఆరు కోవీ షీల్డ్ టీకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖాళీ సిరంజీల్లో నీరు నింపి రాజు అమ్ముతున్నాడా, నిజమైన టీకాలనే అమ్ముతున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!