
తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు వియ్యంకులుగా మారుతున్నారు. వారే.. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిలు. బొండా ఉమ కొడుకు సిదార్థ్ (Bonda Siddhartha), సుబ్బారెడ్డి కూతురు జస్విత రెడ్డిలు (Jashwanthi Reddy) త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. వీరి పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. పలు కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. సిదార్థ్, జస్విత రెడ్డిలు అమెరికాలో కలిసి చదువుకున్నారు. అక్కడ వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు టీడీపీ కార్యకలాపాల్లో చురుకుగ్గా పాల్గొంటున్నారు.
అయితే సిదార్థ్ రెడ్డి, జస్విత రెడ్డిల పెళ్లికి ఇరుకుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. కొన్ని విషయాల్లో ఇబ్బందులతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ జంట నిశ్చితార్థం ఫిక్స్ అయింది. ఇందుకు నిశ్చితార్థ వేడుకకు బొండా ఉమ, ఏవీ సుబ్బారెడ్డిలు వారి పిల్లలతో కలిసి చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వారు ట్విట్టర్లో షేర్ చేశారు.
‘త్వరలో జరగనున్న మా నిశ్చితార్థం మరియు పెళ్లి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఈరోజు చంద్రబాబు గారిని.. Bonda Siddhartha, మా నాన్న సుబ్బారెడ్డి గారు, మామయ్య బొండా ఉమ గారితో కలిసి ఆహ్వానించడం జరిగింది’ అని జస్విత రెడ్డి ట్విట్టర్లో ఫోటోలు షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటోలు టీడీపీ గ్రూప్స్లో, సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక, పెద్దలు నిశ్చయించిన మేరకు సిదార్థ్, జస్విత రెడ్డిల నిశ్చితార్థం ఈనెల 27న జరగనుంది. హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ఈ వేడుకును నిర్వహించనున్నారు. ఈ నిశ్చితార్థ వేడుక బొండ ఉమ, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాల్లోనే కాకుండా.. టీడీపీ కుటుంబ వేడుకగా మారనుంది.
అయితే టీడీపీ నాయకులు ఇలా బంధుత్వం కలుపుకోవడం ఇదే తొలిసారి ఏమి కాదు. గతంలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, పి.నారాయణ వియ్యంకులు కాగా.. భీమవరం మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు కూడా గంటాకు వియ్యంకులే. దివంగత నేత ఎర్రనాయుడి కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడు.. విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తె శ్రావ్యను వివాహం చేసుకున్నారు. రామ్మోహన్ నాయుడు సోదరి ప్రస్తుత రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మామ కూడా టీడీపీ నేతగా ఉన్నారు.