బిజెపి అంటే చంద్రబాబుకు భయం....సంచలన వ్యాఖ్యలు

First Published Feb 17, 2018, 1:46 PM IST
Highlights
  • చంద్రబాబు మాత్రం ఎందుకు అమలు చేయలేకపోతున్నారంటూ విరుచుకుపడ్డారు.

చంద్రబాబునాయుడును బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు దుమ్ము దులిపేశారు. పోయిన ఎన్నికల్లో టిడిపి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు సంగతేంటి? అంటూ నిలదీశారు. తమ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చామని, మరి చంద్రబాబు మాత్రం ఎందుకు అమలు చేయలేకపోతున్నారంటూ విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో వీర్రాజు మాట్లాడుతూ, ఏపీకి కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.16వేల కోట్లను ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిందంతా ఇచ్చేసిందని, ఇంకేం బాకీ ఉన్నామో  చెప్పాలంటూ చంద్రబాబును నిలదీశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎక్కువే సాయం చేసిందని, అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చిందని, సంతృప్తిగా ఉన్నామని గతంలో చాలాసార్లు ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో తాము ఎదుగుతామని టీడీపీకి భయం పట్టుకుందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

రాష్ట్ర విభజన చట్టం అమలుకు 2022 వరకు సమయం ఉందని, ఇప్పటి నుంచే ఉద్యమం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ నాలుగేళ్లలో 60 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.16 వేల కోట్లు ఇచ్చామని గుర్తుచేశారు. ఆ మొత్తాన్ని రైతు రుణమాఫీ పేరుతో ఖర్చుచేసి, అభివృద్ధిని పక్కన పెట్టారని మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకి రూ.1050 కోట్లు పారిశ్రామిక రాయితీ కేటాయిస్తే  ఒక్క పరిశ్రమకైనా ఆ నిధులు కేటాయించారా అని ధ్వజమెత్తారు.

గత ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని ఒక్కటైనా అమలు చేశారా అని వీర్రాజు సూటిగా ప్రశ్నించారు.  నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ ఏమైందన్నారు. మీడీయా ద్వారా రాష్ట్ర ప్రజల ముందు జీజేపీని దోషిని చేసే ప్రయత్నంలో టిడిపి ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతోందని టీడీపీకి భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యలు చేశారు.

 

click me!