ఆంధ్ర ప్రదేశ్ ను అప్పులప్రదేశ్ మార్చిన ఘనత ఆ ఇద్దరిదే..: ఎమ్మెల్సీ మాధవ్

By Arun Kumar PFirst Published May 21, 2021, 6:01 PM IST
Highlights

కేంద్రంతో పోల్చుకుని రాష్ట్రాలు చేయడం సమంజసం కాదని... కేంద్ర ఆర్ధిక వెలుసుబాటులకు, రాష్ట్రాలకు ఎంతో వ్యత్యాసం ఉంటుందన్నారు బిజెపి ఎమ్మెల్సీ మాధవ్.  

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ ను అప్పులప్రదేశ్ గా మార్చేశారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. అప్పులతో పబ్బం గడపడం తప్ప జగన్ చేసిందేమీ లేదన్నారు. కేంద్రంతో పోల్చుకుని రాష్ట్రాలు చేయడం సమంజసం కాదని... కేంద్ర ఆర్ధిక వెలుసుబాటులకు, రాష్ట్రాలకు ఎంతో వ్యత్యాసం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు, ఆచరణకు ఎంతో వ్యత్యాసం ఉంటుందని మాధవ్ పేర్కొన్నారు. 

''గత బడ్జెట్ తో పోలిస్తే ఒక్కదానిలో తప్ప అన్ని అంశాల్లోనూ ఆదాయం తగ్గింది. సంపూర్ణ మద్య నిషేధం అన్న జగన్... అదే మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ప్రజలతో బాగా తాగించి.. ఆ డబ్బుతో సంక్షేమం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు'' అని ఆరోపించారు. 

''ఎపీ అప్పు 3లక్షల 74వేల కోట్ల రూపాయలకు చేరింది. 97వేల కోట్లతో రాష్ట్ర విభజన జరిగితే.. గత టీడీపీ హయాంలో రెండు లక్షల కోట్ల అప్పుగా మార్చారు. వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల కాలంలోనే లక్షా 18వేల కోట్ల అప్పులు చేశారు'' అన్నారు. 

read more  రెండేళ్లలో 28మంది దారుణ హత్య: వైసిపి సర్కార్ పై అనగాని సంచలనం

''ఈ ప్రభుత్వానికి ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప.. ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదు. వార్డు వాలంటీర్ల వ్యవస్థను ఓట్లు పెంచుకునేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇంగ్లీషు మాధ్యమానికి మేము వ్యతిరేకంగా కాదు.. కానీ మాతృభాషను చంపవద్దని బీజేపీ కోరుతుంది. ఇతర రాష్ట్రాలలో ఉన్న భాషాభిమానం మన ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టం. మన భాష, సంస్కృతి పట్ల ఆలోచన చేస్తే.. గౌరవం ఉంటుంది. మాతృభాషను మృతభాషగా మార్చవద్దు... దీనిపై ఏస్థాయిలో అయినా మేము పోరాటాలు చేసేందుకు సిద్దంగా ఉన్నాం'' అన్నారు. 

''కోవిడ్ పరీక్షల విషయంలో కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వైద్యంపై కోట్లు ఖర్చు పెడుతున్నా అవి పేదలకు ఉపయోగపడటం లేదు. ఆరోగ్య శ్రీ వంటి వాటి వల్ల ప్రైవేటు ఆసుపత్రులు బాగు పడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తే అందరికీ మేలు జరుగుతుంది. జులై నాటికి కేంద్రం దేశ మొత్తం వ్యాక్సినేషన్ ను ఉచితంగా అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాక్సిన్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. కేంద్రం ఇచ్చిన వ్యాక్సిన పైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధార పడుతుందిరాష్ట్రానికి ఇచ్చే వాటాలను కేంద్రం పెంచినా.. ఆ విషయాన్ని మాత్రం వైసీపీ చెప్పడం లేదు'' అన్నారు ఎమ్మెల్సీ మాధవ్.

click me!