
వైసీపీ ఎంపీ వియజసాయి రెడ్డిపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కులం పేరుతో తిట్టడం సరికాదని బండ్ల గణేష్ అన్నారు. కులాల పేరుతో చిచ్చు పెడితే.. నీ చరిత్రకి నువ్వే చింపి చిచ్చు పెట్టుకున్న పిచ్చ పిచ్చుక అవుతావని అంటూ మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డం పెట్టుకుని కమ్మ కులంని తిట్టవద్దని కోరారు. తాను కమ్మ వ్యక్తినేనని.. కానీ టీడీపీ కాదని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో వరుస ట్వీట్స్ చేశారు. ‘‘మీకు కులం నచ్చకుంటే.. కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టండి... చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండి. అధికారం శాశ్వతం కాదు. రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు. ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు. నేను కమ్మ వాణ్ణే కానీ టీడీపీ కాదు’’ అని బండ్ల గణేష్ అన్నారు.
‘‘నీ పిచ్చకి, నీ కుల పిచ్చకి, నీ డబ్బు పిచ్చకి, కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది’’ అని బండ్ల ట్వీట్ చేశారు. తనకు వైఎస్సార్ అన్నా, సీఎం జగన్ అన్నా గౌరవమే అని చెప్పారు. కానీ విజయసాయి రెడ్డి రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని విమర్శించారు. తమ కులాన్ని అన్ని విషయాల్లో ఎందుకు లాగుతున్నావ్ అని విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ను చూసి నేర్చుకోవాలని.. అన్ని కులాల్లో మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు ఉంటారని చెప్పారు.
చంద్రబాబుతో ఏదైనా ఉంటే ఆయనతో తేల్చుకోవాలని అన్నారు. విశాఖని దోచుకున్న డబ్బుతో హైదరాబాదు కొనుక్కోవాలని ఎద్దేవా చేశారు. వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బ రుచిచూపిస్తారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎవరైనా నచ్చకుంటే వారిని పేరు పెట్టి తిట్టాలన్నారు. కానీ కులాన్ని తిట్టడం ఏమిటని ప్రశ్నించారు. వియయసాయి రెడ్డిని జైలుకు పంపింది కమ్మ వారు కాదు కదా అంటూ చురకలు అంటించారు.
త్వరలోనే సీఎం జగన్కు విజయసాయి రెడ్డి వెన్నుపోటు పొడుస్తారని ఆరోపించారు. ఈ ట్వీట్స్ తర్వాత తనను విజయసాయిరెడ్డి ఎంత ఇబ్బంది పెడతాడో తెలుసని.. అన్నిటికీ సిద్ధపడే ఉన్నానని చెప్పుకొచ్చారు. కమ్మ వారిని తిట్టాడాన్ని తట్టుకోలేక పోతున్నానని బండ్ల గణేష్ చెప్పారు. నచ్చని వారిని పేరు పెట్టి తిట్టాలని విజయసాయిరెడ్డికి సూచించారు. దయచేసి కులాన్ని తిట్టవద్దని కోరారు. ఇదేనా సంస్కారం అని విజయసాయిని ప్రశ్నించారు.
విజయసాయి రెడ్డి బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసునని.. ఎంపీగా అధికారంలో ఉన్నానని కళ్ళు నెట్టికెక్కి ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. ఇలాంటి వ్యక్తులను దగ్గరపెట్టుకోవద్దని సీఎం జగన్ను కోరారు. ఇలాంటి వ్యక్తులను దగ్గరపెట్టుకుని రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని అన్నారు. తనకు కుల పిచ్చి లేదని.. తన కులాన్ని తాను ప్రేమిస్తానని.. ప్రతి కులాన్ని గౌరవిస్తానని చెప్పారు.
పవన్ కల్యాణ్ అంటే ఇష్టం.. ఓ మంత్రి కూడా..
తనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే ఇష్టమని.. అలాగే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి అంటే కూడా ఇష్టమని చెప్పారు. ‘‘విజయసాయిరెడ్డి నువ్వు పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాలని అనుకుంటున్నావు.. అది నీకు మంచిది కాదు.. టీడీపీ కుల పార్టీ అయితే మీరు ఎందుకు కమ్మ వారిని టికెట్ ఇచ్చారు’’ అని ప్రశ్నించారు.
తాము కష్టాన్ని నమ్ముకున్న రైతులమని బండ్ల గణేష్ అన్నారు. ‘‘ నువ్వు విశాఖలో దోచుకొని హైదరాబాద్ కు తరలిస్తున్నవు... ఇది ప్రపంచానికి తెలుసు. అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్భాజీవి. నిన్ను జగన్ గారు కట్ చెయ్యడం ఖాయం. ఆ కట్కి జనం కారం పెట్టడం ఖాయం. వైజాగ్ ని కుదిపేసిన తూఫాన్ నయం నీ కన్నా. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేసావ్ విష సాయి’’ అని బండ్ల గణేష్ ట్వీట్స్ చేశారు.
ఇక, గత సర్కార్ తమ వర్గానికి చెందినవారికే ఉద్యోగాలు కల్పించేవారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. అంతేకాదు టీడీపీ కుల పార్టీ అని విమర్శించారు. ఈ క్రమంలోనే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినట్టుగా తెలుస్తోంది.