లవర్తో పెళ్ళికి నో చెప్పిన పేరేంట్స్
కర్నూల్: కర్నూల్ జిల్లా బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి తనయుడు కాటసాని నాగార్జున రెడ్డి శుక్రవారం నాడు ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లవ్ వ్యవహారమే ఈ ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకొనేందుకు నాగార్జున రెడ్డి తల్లిదండ్రులు అంగీకరించలేదనే ప్రచారం సాగుతోంది.ఈ కారణంగానే నాగార్జునరెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు.
జూన్ 14వ తేదిన బెంగుళూరు నుండి తండ్రితో కలిసి బనగానపల్లికి నాగార్జున రెడ్డి వచ్చారు. తండ్రితో పెళ్ళి విషయమై ఆయన వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. ఈ విషయమై తన మాటను తల్లిదండ్రులు వినడం లేదనే మనోవేదనకు గురైన నాగార్జున రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తెలిపాయి. నాగార్జునరెడ్డి ఆత్మహత్యపై మరింత సమాచారం తెలియాల్సివుంది.