అనకాపల్లి హార్టికల్చర్ పరిశోధన కేంద్రం కడపకు: జగన్ పై అయ్యన్న ఆగ్రహం (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 11, 2020, 1:06 PM IST
Highlights

 అనకాపల్లిలో రైతులకు ఉపయోగపడే  హార్టికల్చర్ పరిశోధన కేంద్రాన్ని కడపకు తరలించే ప్రయత్నం సీఎం జగన్  చేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. 
 

విశాఖపట్నం: ఓవైపు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూనే మరోవైపు అదే రైతులకు ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.  అనకాపల్లిలో రైతులకు ఉపయోగపడే  హార్టికల్చర్ పరిశోధన కేంద్రాన్ని కడపకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

''శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడు జిల్లాలకు కలిపి రైతులకు ఉపయోగపడే విధంగా అనకాపల్లిలో 107 సంవత్సరాల క్రితం వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని స్థాపించిన సంగతి అందరికీ తెలుసు. ఆనాడు పరిశోధన కేంద్రం కోసం 107 ఎకరాలు కేటాయించారు. అప్పటి నుంచి ఆ క్షేత్రం ద్వారా పరిశోధనలు చేసి రైతులకు ఉపయోగపడే విధంగా తోడ్పాటు అందించడం జరిగింది. అలాంటి క్షేత్రాన్ని నిర్వీర్యం చేయడం ఎంతవరకు సబబో ఆలోచించాలి'' అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

''అనకాపల్లి ఎమ్మెల్యే ఆ 107 ఎకరాల్లోనే 30 ఎకరాల్లో మెడికల్ కాలేజీ సాంక్షన్ చేశామని, అక్కడే నిర్మిస్తామని చెబుతున్నారు. మెడికల్ కాలేజీకి మేం వ్యతిరేకం కాదు. వ్యవసాయదారులకు ఏర్పాటుచేసిన మంచి పరిశోధన క్షేత్రంలో 30 ఎకరాలు కేటాయించడం అంటే రైతులకు అన్యాయం చేసినట్లే. పరిశోధన కేంద్రానికి నష్టం జరుగుతుంది. ఇతరత్రా స్థలాల్లో మెడికల్ కాలేజీని ఏర్పాటుచేయాలి'' అని సూచించారు. 

వీడియో

"

''అంతేకాకుండా అనకాపల్లిలోని వ్యవసాయ పరిశోధన కేంద్రాన్నికడప జిల్లాకు తరలించేందుకు జగన్మోహన్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్రకు ఉపయోగపడే వ్యవసాయ క్షేత్రాన్ని కడపకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? కడపలో ఇప్పటికే రెండో, మూడో ఉన్నాయి. కావాలంటే నూతనంగా ఏర్పాటుచేసుకోవాలి'' అని సూచించారు. 

''ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అని చెప్పిన మీరే ఇలా రైతులకు ఉపయోగపడే  హార్టికల్చర్ పరిశోధన కేంద్రాన్ని తరలించడం అంటే ఇక్కడి రైతులకు అన్యాయం చేసినట్లే. రైతు ప్రభుత్వం అని చెప్పి రైతులకు అన్యాయం చేస్తున్నారు. వైకాపా నేతలు పట్టుదలగా వ్యవహరించి క్షేత్రం అక్కడే ఉండేలా ఏర్పాట్లుచేయాలి. రైతులు కూడా డిమాండ్ చేయాలి. రాజకీయాలు సరికావు'' అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 
 

click me!