అవన్నీ ఆయుర్వేద పదార్ధాలే, ఐ డ్రాప్స్‌ కూడా హానికరం కాదు: ఆనందయ్య మందుపై ఆయుష్ కమీషనర్

By Siva KodatiFirst Published May 23, 2021, 3:19 PM IST
Highlights

ఆనందయ్య మందును ఆయుర్వేదంగా గుర్తించే అవకాశం వుందన్నారు ఆయుష్ కమీషనర్ రాములు. మందుపై తుది అధ్యయనం జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే ఆయుర్వేదంగా గుర్తించవచ్చని రాములు తెలిపారు.

ఆనందయ్య మందును ఆయుర్వేదంగా గుర్తించే అవకాశం వుందన్నారు ఆయుష్ కమీషనర్ రాములు. మందుపై తుది అధ్యయనం జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే ఆయుర్వేదంగా గుర్తించవచ్చని రాములు తెలిపారు.

మందు తయారీలో వాడుతున్న పదార్ధాలన్నీ ఆయుర్వేదంలో ఉపయోగించేవేనని.. ఇవాళ సాయంత్రానికల్లా నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రాములు వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్, లైసెన్స్ వంటివి పూర్తయితే ఆయుర్వేదంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు.

ఆయుర్వేదంగా గుర్తింపు ఇచ్చే అంశం రాష్ట్ర పరిధిలో వుంటుందని.. కానీ కేంద్ర సాయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే అధ్యయన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. మందు తయారీ విధానాన్ని బహిరంగ పర్చేందుకు ఆనందయ్య అంగీకరించారని.. ఆనందయ్య ఇచ్చే ఐ డ్రాప్స్‌లో కూడా ఎలాంటి హానికారకాలు లేవని రాములు తెలిపారు.

Also Read:ఆనందయ్య మందుకు అనుమతిస్తే ఆయుర్వేద ఫార్మసీలో తయారీకి సిద్దం: చెవిరెడ్డి

తేనే, ముళ్ల వంకాయ, తోక మిరియాల మిశ్రమంతో ఐ డ్రాప్స్ తయారు చేస్తున్నారని రాములు చెప్పారు. ఐ డ్రాప్స్ వల్ల ఇబ్బందులు వుండవని ఆయుర్వేద వైద్యుల బృందం నిర్థారించిందని తెలిపారు. ఆనందయ్య వాడుతున్న వివిధ పదార్ధాల మిశ్రమంతో ఎలాంటి ఎఫెక్ట్ వుండదని ల్యాబ్ టెస్టుల ద్వారా నిర్ధారణ అయ్యిందన్నారు.

ఆనందయ్య ఎవరెవరికి మందులిచ్చారో డేటా సేకరించే ప్రయత్నం చేస్తున్నామని.. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆయుర్వేదిక్ స్టడీస్‌కు ఈ డేటా అందిస్తామని ఆయుష్ కమీషనర్ స్పష్టం చేశారు. ఆ బృందం దీనిపై అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. 

click me!