ఆయేషా మీరా హత్య కేసు.. మిమిక్రీతో నన్ను హంతకుడిని చేశారు: సత్యంబాబు

By sivanagaprasad KodatiFirst Published Jan 18, 2019, 1:26 PM IST
Highlights

పోలీసుల స్క్రిప్ట్‌ ప్రకారమే చెప్పా.. నా వాయిస్ మిమిక్రీ చేయించి ఎడిటింగ్ ద్వారా తానే హంతకుడినని పోలీసులు మీడియాకు విడుదల చేశాడని సత్యంబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. జైల్లో ఎవరెవరు కలిసేవారు, కోర్టులో నీ తరుపున వాదించిన న్యాయవాదులకు ఫీజు ఎవరు కట్టారు అని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం కలిగించిన విజయవాడ ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబును సీబీఐ అధికారులు రెండు గంటల పాటు విచారించారు. కృష్ణా జిల్లా అనాసాగరంలో ఉన్న సత్యంబాబు ఇంటికి నలుగురు సభ్యులు గల సీబీఐ బృందం ఉదయం చేరుకుంది.

ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను అతను అధికారులకు అందజేశాడు. అయేషా మీరా హత్య కేసులో తనను అన్యాయంగా ఇరికించారని,  విచారణ పేరుతో పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం బతకడానికి తనకు ఉపాధి కూడా లేదని వాపోయాడు.

సత్యం బాబు ఇంటిలో ఉన్న వస్తువులను తనిఖీ చేయడంతో పాటు బ్యాంక్ ఖాతాలలో గత ఎనిమిదేళ్లలో జరిగిన వ్యవహారాలను సీబీఐ అధికారులు పరిశీలించారు. అంతకు ముందు సీబీఐ అధికారులు ఏం చేశారు, ఎంతవరకు చదువుకున్నారు అన్న దానిపై ఆరా తీశారు.

ఆయేషా మీరా హత్యకు ముందు సత్యంబాబు ఎన్ని దొంగతనాల కేసుల్లో అరెస్ట్ అయ్యాడు అన్న దానిపై రికార్డులు పరిశీలించారు. నిర్దోషిగా ప్రకటించిన తర్వాత మళ్లీ ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ సీబీఐని సత్యంబాబు ఎదురు ప్రశ్నించాడు.

గతంలో తాను సెల్‌ఫోన్లు దొంగతనం చేసేవాడినని అంతకుమించి ఏం తాను ఎలాంటి నేరం చేయలేదని సత్యంబాబు వివరించాడు. తొలిసారి తనను అరెస్ట్ చేసిన పోలీసులు కంచికచర్ల సమీపంలోని ఓ రిసార్ట్‌కు తరలించినట్లు తెలిపాడు.

రెండు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు ఒప్పుకోవాలని బెదిరించారని అతను వ్యాఖ్యానించాడు. ప్రాణభయంతోనే తాను ఆయేషా మీరాను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సత్యం బాబు వెల్లడించాడు. అయితే ఆయేషాను ఏ విధంగా చంపింది వివరిస్తూ గతంలో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు ప్లే చేసి.. కొన్ని ప్రశ్నలు సంధించారు.

పోలీసుల స్క్రిప్ట్‌ ప్రకారమే చెప్పా.. నా వాయిస్ మిమిక్రీ చేయించి ఎడిటింగ్ ద్వారా తానే హంతకుడినని పోలీసులు మీడియాకు విడుదల చేశాడని సత్యంబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. జైల్లో ఎవరెవరు కలిసేవారు, కోర్టులో నీ తరుపున వాదించిన న్యాయవాదులకు ఫీజు ఎవరు కట్టారు అని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సత్యంబాబుతో విచారణ పూర్తయిన అనంతరం ఇబ్రహీంపట్నంలో ఆయేషా మీరా హత్యకు గురైన దుర్గా హాస్టల్‌ను సీబీఐ అధికారులు పరిశీలించనున్నారు.

ఆయేషా మీరా కేసులో దారుణమైన ట్విస్ట్

అయేషా మీరా హత్య కేసు: సత్యంబాబును విచారిస్తున్న సిబిఐ

click me!