ఆటో డ్రైవర్ కుమార్తె.. ఆల్ ఇండియా ర్యాంకు సాధించింది.
ఆటో డ్రైవర్ కుమార్తె.. ఆల్ ఇండియా ర్యాంకు సాధించింది. కోల్ కత్తాలోని ఐసీడబ్ల్యూఏ చాప్టర్ డిసెంబర్ లో జరిగిన ఫైనల్ పరీక్షా ఫలితాల్లో విజయవాడ కానూరుకి చెందిన ఆటో డ్రైవర్ కుమార్తె మనీషా ఆలిండియా 11వ ర్యాంకు సాధించింది. శ్రీకాకుళం జిల్లా మరకపేటకు చెందిన గెంబలి సురేంద్ర ఆలిండియా 3వ ర్యాంకు సాధించగా.. మనీషా 11వ ర్యాంకు కైవసం చేసుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా వడాలికి చెందిన ప్రవీణ్ కుమార్ ఆలిండియా 12వ ర్యాంకు సాధించాడు. కాగా.. ఈ ముగ్గురూ విజయవాడలోని సూపర్ విజ్ సంస్థలో శిక్షణ పొందడం విశేషం. ఒకే సంస్థలో శిక్షణ పొంది.. మెరుగైన ర్యాంకులను సాధించినందుకు ఆ సంస్థ ప్రన్సిపల్ ఆనందం వ్యక్తం చేశారు.
తనకు 11వ ర్యాంకు వచ్చిన సందర్భంగా మనీషా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని చెప్పింది. తనను ఉన్నత స్థాయిలో చూడాలనేది తన తండ్రి కల అని ఆమె తెలిపింది. పగలు, రాత్రి ఆటో నడి ఆ డబ్బుతో తనను సీఏ కోర్సులో జాయిన్ చేశారని గుర్తు చేసుకుంది. ఇప్పుడు తన తండ్రి పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని చెప్పింది.