ఆనందయ్య మందుతో నకిలీ వ్యాపారం... ఆ కంపనీ కుట్ర: అచ్చెన్న సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : Jun 06, 2021, 11:39 AM IST
ఆనందయ్య మందుతో నకిలీ వ్యాపారం... ఆ కంపనీ కుట్ర: అచ్చెన్న సంచలనం

సారాంశం

బెదిరించిన వాళ్లని, బ్లాక్ మెయిల్ చేసిన వారిని వదిలేసి ప్రజల తరపున నిలబడి అవినీతిని నిలదీసిన వారిపై కేసులు పెడతారా? అంటూ సోమిరెడ్డిపై నమోదయిన కేసుపై స్పందిస్తూ పోలీసులను అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

ఆనందయ్య తయారు చేసిన మందుతో నకిలీ వ్యాపారానికి తెరలేపిన వైసీపీ నేతలను వదిలి... కుట్రను బయటపెట్టిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయడం దుర్మార్గమని టీడీపీ  రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి చట్టాలపై అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. కుట్రను బయటపెట్టిన వ్యక్తిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కేసులు ఏ విధంగా పెడతారు? అని అచ్చెన్న నిలదీశారు. 

''బెదిరించిన వాళ్లని, బ్లాక్ మెయిల్ చేసిన వారిని వదిలేసి ప్రజల తరపున నిలబడి అవినీతిని నిలదీసిన వారిపై కేసులు పెడతారా? ప్రభుత్వ అరాచకాన్ని, నిర్వాకాలను ప్రశ్నిస్తే.. ప్రజాస్వామ్యం కల్పించిన హక్కుల్ని సైతం పీక నులిమి చంపేందుకు సిద్ధమవడం సిగ్గుచేటు'' అని విమర్శించారు.

''ఆనందయ్య అనుమతి లేకుండా వెబ్ సైట్ తయారు చేసి.. ప్యాకెట్ రూ.167కు అమ్ముకోవాలని ఎమ్మెల్యే కాకాణి అనుచరుడి శేశ్రిత టెక్నాలజీస్ అనే సంస్థ ప్రయత్నిస్తే వారిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు.? దొంగతనంగా ఆనందయ్య మందును అమ్ముకోవడానికి ప్రయత్నించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.?'' అని నిలదీశారు. 

read more  ఆనందయ్య మందుపై విమర్శలు: సోమిరెడ్డిపై కేసు నమోదు

''దొంగతనం చేయడం.. ఆ తప్పును వేరొకరిపై నెట్టేయడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిపోయింది. ప్రజల ప్రాణాలు కాపాడే మందుతో నీచంగా వ్యాపారం చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నించడం హేయం. దొంగతనంగా మందు తయారు చేయడం, అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు'' అని ఆరోపించారు. 

''అసలు వ్యవహారాన్ని బయట పెట్టిన టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే.. అక్రమ వ్యాపారాలు, అవినీతి సంపాదనే ముఖ్యమనేలా వ్యవహరించడం సిగ్గుచేటు. సోమిరెడ్డిపై నమోదు చేసిన తప్పుడు కేసుల్ని వెంటనే ఎత్తేయాలి. ఆనందయ్య మందును దొంగచాటుగా అమ్ముకునేందుకు ప్రయత్నించిన వారిపై కేసు నమోదు చేసి విచారణ చేయాలి'' అని అచ్చెన్న డిమాండ్ చేశారు. 

 
 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్