అమెరికాలో తెలుగు అమ్మాయి ఓడిపోయింది

First Published Jun 28, 2018, 8:27 AM IST
Highlights

అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఆరో కాంగ్రెస్‌ డిస్ట్రిక్ట్‌ ప్రైమరీ ఎన్నికలో మన తెలుగమ్మాయి అరుణా మిల్లర్ ఓటమిపాలయ్యారు. 

అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఆరో కాంగ్రెస్‌ డిస్ట్రిక్ట్‌ ప్రైమరీ ఎన్నికలో మన తెలుగమ్మాయి అరుణా మిల్లర్ ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల కోసం రూ.65 కోట్లు ఖర్చు పెట్టిన ఆమె ప్రత్యర్థి డేవిడ్‌ ట్రోన్‌ విజయం సాధించాడు. దీంతో అమెరికన్ కాంగ్రెస్‌లో అడుగుపెట్టాలనుకున్న అరుణ కల కలగానే మిగిలిపోయింది. కృష్ణా జిల్లాకు చెందిన అరుణా మిల్లర్ ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఉన్నట్లయితే, వాషింగ్టన్ రాష్ట్రం నుంచి అమెరికా ప్రతినిధుల సభలోకి ప్రవేశించిన రెండవ ప్రవాస భారతీయ మహిళగా చరిత్ర సృష్టించి ఉండేది.

అత్యంత ధనికుడైన డేవిడ్ ట్రోన్ ఈ ఎన్నికల్లో 5,544 మెజారిటీతో అరుణా మిల్లర్‌పై విజయం సాధించారు. డేవిడ్‌ ట్రోన్‌ 22,855 ఓట్లు దక్కగా, మిల్లర్‌ గట్టి పోటీనిచ్చి 17,311 ఓట్లను దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడటం వల్లనే ఆమె విజయం కష్టంగా మారింది. మరోవైపు ట్రోన్ ఈ ఎన్నికల కోసం విచ్చలవిడిగా ధనాన్ని వెచ్చించడం కూడా ఆమె పరాజయానికి ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ, ఈ ఎన్నికల్లో ఆమె అందరికీ గట్టి పోటీనిచ్చి ద్వితీయ స్థానంలో నిలిచారు. 

ఇక అరుణా మిల్లర్ విషయానకి వస్తే.. తనకు ఏడేళ్లున్నప్పుడే తన తండ్రితోపాటు అమెరికాకు వచ్చేసింది. ప్రస్తుతం ఆమె వయస్సు 53 ఏళ్లు. వృత్తిరీత్యా సివిల్ ఇంజినీర్ అయిన అరుణా మిల్లర్ మన తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడగలదు. వర్జీనియా, హవాయ్, కాలిఫోర్నియాలతోపాటు మౌంట్‌గొమెరీ కౌంటీలో పాతికేళ్లపాటు రవాణాశాఖలో ఇంజినీరుగా ఆమె సేవలందించారు. ఆ తర్వాత 2015లో ప్రభుత్వ ఉద్యోగం నుంచి విరమణ పొంది, పూర్తిస్థాయిలో మేరీల్యాండ్ నియోజకవర్గం నుంచి రాజయకీయ అరంగేట్రం చేశారు.

click me!