
అరకు.. కొండ కోనలు, రాష్ట్రాల సరిహద్దులను దాటి విస్తరించిన దండకారణ్యం, గిరిజనులకు ఆలవాలంగా అలరారుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఏకైక ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ నియోజకవర్గం అరకు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని ఏడు ఎస్టీ నియోజకవర్గాల సమ్మేళనంగా ఈ స్థానం వుంది. దేశంలో గిరిజన ఓటర్లే ఎక్కువగా వుండే అతి కొన్ని నియోజకవర్గాల్లో అరకు ఒకటి. కొండలు, లోయలతో కూడిన ఏజెన్సీ ప్రాంతంతో పాటు మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ వంటి మైదాన ప్రాంత నియోజకవర్గాలు అరకులో భాగంగా వున్నాయి. పాలకొండ నుంచి రంపచోడవరం వరకు అరకు పార్లమెంట్ నియోజకవర్గం విస్తరించి వుంది.
అరకు ఎంపీ (లోక్సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. మొత్తం గిరిజన ఓటర్లే :
మైదాన ప్రాంతాలతో పోలిస్తే అరకు ఓటర్లు ఎప్పుడూ భిన్నమైన తీర్పు వెలువరిస్తూ వుంటారు. అరకులో వాతావరణం ఎంత కూల్గా వుంటుందో, ఇక్కడి రాజకీయాలు అంత హాట్గా వుంటాయి. అరకు అంటే ఓ ఏరియానే కాదు.. ఎమోషన్ కూడా. గిరిజనులే అయినా రాజకీయ చైతన్యం మెండు. ఒకప్పుడు మావోయిస్టులకు సేఫ్ జోన్గా వున్న ఈ ప్రాంతం .. ఇప్పుడు రాజకీయాలకు వార్ జోన్గా మారింది.
సామాన్యులను నాయకులుగా మార్చి చట్టసభల్లో కూర్చోబెట్టిన ఘనత అరకు సెగ్మెంట్ది. అరకు పార్లమెంట్ పరిధిలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం శాసనసభ స్థానాలున్నాయి. వీటిలో ఒక్క పార్వతీపురం మినహా మిగిలిన ఆరు ఎస్టీ రిజర్వ్డ్. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
అరకులో మొత్తం ఓటర్ల సంఖ్య 14,51,418 ఓట్లు .. పురుష ఓటర్ల సంఖ్య 7,41,626 మంది.. మహిళా ఓటర్లు 7,09,698 మంది. 2019 లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి గొడ్డేటీ మాధవీకి 5,62,190 ఓట్లు పోలవ్వగా.. టీడీపీ అభ్యర్ధి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్కు 3,38,101 ఓట్లు పోలయ్యాయి. మూడో స్థానంలో నోటా నిలవడం విశేషం. మొత్తంగా వైసీపీ 2,24,089 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. గత ఎన్నికల్లో 10,74,538 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. 74.03 శాతం పోలింగ్ నమోదైంది.
అరకు ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో నిలిచేదెవరు :
అరకు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మూడుసార్లు లోక్సభ ఎన్నికలు జరగ్గా.. వైసీపీ రెండు సార్లు విజయం సాధించి ఈ సెగ్మెంట్ను తన కంచుకోటగా మార్చుకుంది. లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా వైసీపీ ఆధిపత్యంలోనే వున్నాయి. మరోసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని ఫ్యాన్ పార్టీ భావిస్తుండగా.. వైసీపీ కంచుకోటను బద్ధలుకొట్టాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. సిట్టింగ్ ఎంపీ గొడ్డేటి మాధవిని అరకు లోక్సభ స్థానం నుంచి అసెంబ్లీ స్థానానికి మార్చింది వైసీపీ. సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీని ఎంపీగా ప్రకటించింది.
ఇక టీడీపీ విషయానికి వస్తే.. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి టీడీపీని జనం తిరస్కరిస్తూనే వున్నారు. 2019లో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ టీడీపీకి రాజీనామా చేయగా.. మరో కీలక నేత గుమ్మడి సంధ్యారాణి సాలూరు అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే తమకు కలిసిరాని అరకు సీటును టీడీపీ తన మిత్రపక్షాలకు వదిలేస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే జనసేనకు లేదంటే బీజేపీకి ఈ సీటును కేటాయించే అవకాశం వుందని ప్రచారం జరుగుతోంది. 2014లో అరకు ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత మళ్లీ పోటీ చేయాలని పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో వుండటంతో.. గీతకు సులువుగా ఈ టికెట్ దక్కే అవకాశం వుంది.