
పీఆర్సీపై (prc) ఏపీ ఉపాధ్యాయ సంఘాలు (teachers unions) వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా హెచ్ఆర్ఏ (hra) విషయంలో ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు పోరుబాటపట్టారు. ఈ క్రమంలోనే పీఆర్సీ ఐక్య వేదిక ఉద్యమ కార్యాచరణలో భాగంగా సీఎం జగన్కు (ys jagan) వినతి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు (sameer sharma) కార్యాచరణ నోటీసు ఇచ్చేందుకు ఉపాధ్యాయ సంఘాలు సోమవారం తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే ఈ రోజు నుంచి సంతకాల సేకరణ చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది.
ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్ బాబు ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం నిన్న ముఖ్యమంత్రికి ఇచ్చేందుకు వెళ్లగా.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి (sajjala rama krishna reddy) వినతిపత్రం ఇవ్వాలని సీఎంఓ సూచించింది. అయితే ఆయన కూడా అందుబాటులో లేనందున మంగళవారం ఇచ్చే అవకాశం ఉంది. ముందుగానే నిర్ణయించుకున్న కార్యాచరణ మేరకు మార్చి 8వ తేదీ వరకు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్సీపై పునఃసమీక్షించాలని కోరుతూ సంతకాల సేకరణ చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది.
ఇకపోతే .. ఈ నెల 21 నుంచీ 24 వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల తో బ్యాలెట్ల నిర్వహణ చేపట్టడమే కాదు మంత్రులు, ఎంఎల్ఏ లకు విజ్ఞాపన సమర్పించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 25న ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాయాలని నిర్ణయించారు. వచ్చే నెల మార్చి 2,3 తేదీలలో జిల్లా కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహారదీక్ష చేయనున్నారు. అలాగే మార్చి 7,8 తేదీలలో రాష్ట్రస్ధాయి రిలే నిరాహారదీక్ష నిర్వహణకు ఉపాధ్యాయ సంఘాలు కార్యాచరణ రూపొందించాయి.
ఇప్పటికే పీఆర్సీ సాధన కోసం మరో ఐక్య వేదిక ఏర్పాటయ్యింది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ పీఆర్సీపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోకుండానే వెనక్కితగ్గిందని పలు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలా ఉద్యోగ సంఘాల జేఏసీతో విభేదించిన ఉద్యోగ సంఘాలు పీఆర్సీ ఉద్యమాన్ని కొనసాగించడానికి కొత్త జేఏసీగా ఏర్పడ్డాయి. ఈ జేఏసిలో ఉపాధ్యాయ సంఘాలు కీలకంగా వ్యవహరిస్తోంది. పలు ఉద్యోగ సంఘాలు, కార్మిక, పింఛనుదారుల ఐక్యవేదిక ఏర్పాటైంది. ఇలా పీఆర్సీ కోసం పోరాడేందుకు 34 ఉద్యోగ సంఘాలు జేఏసిగా ఏర్పడ్డాయి.
కొత్తగా ఏర్పడిన జేఏసి విజయవాడలో గత వారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పీఆర్సీ పెంపు, ఉద్యోగుల ఇతర సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. మంత్రుల కమిటీతో గతంలో పీఆర్సీ సాధన సమితి చేసుకున్న ఒప్పందాలను ఈ జేఏసి వ్యతిరేకించింది. పిట్ మెంట్ ను 27శాతానికి పెంచడమే కాదు గ్రాట్యుటీని 2020 ఏప్రిల్ నుండి అమలు చేయాలని, పొరుగుసేవల ఉద్యోగులు క్రమబద్దీకరణ చేయాలంటూ వివిధ డిమాండ్ల సాధనకు ప్రభుత్వంతో పోరాటానికి సిద్దమయ్యారు.