
అమరావతి: బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దమ్ముంటే చంద్రబాబును అరెస్టు చేయాలని వారు సవాల్ విసురుతున్నారు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నాన్ బెయిలబుల్ వారంట్ ఇవ్వడం దారుణమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. ప్రజా ఉద్యమాలు చేస్తే నోటీసులు ఇస్తారా అని అడిగారు. కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్తో పాటు ప్రతిపక్షాల నేతలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నోటీసులు ఇస్తోందని ఆయన అన్నారు.
24 గంటల్లో కేసు వాపసు తీసుకోకుంటే ప్రజాగ్రహం తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో మహాకూటమికి షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబుకు వారెంట్ ఇచ్చారని ఆరోపించారు. బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే కేసీఆర్ అడ్డుకోలేకపోయారని మంత్రి సోమిరెడ్డి విమర్శించారు.
చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రేపు సాయంత్రం నెల్లూరులో భారీ నిరసన కార్యక్రమం చేపడతామని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తెలిపారు. కేసీఆర్ చెప్పినట్లు మోడీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు ఏం తప్పు చేశారని నోటీసులు ఇస్తారని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. మోడదీ వ్యతిరేకిస్తే కక్ష సాధిస్తారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అంటే ఎందుకంత పగ, కోపమని ఆయన అడిగారు.
దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్లాలని ఆయన సవాల్ విసిరారు. మోడీ పాలన చూస్తుంటే హిట్లర్ పాలన గుర్తుకొస్తోందని వర్ల రామయ్య అన్నారు.
ఆపరేషన్ గరుడలో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు జారీ అయ్యాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. మోడీ, జగన్, కేసీఆర్ కలిసి చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. మోడీ కుట్రలను చంద్రబాబు చేధిస్తారని ఆయన అన్నారు.
ఈ వార్తాకథనాలు చదవండి
2010లో ధర్మాబాద్ లో చంద్రబాబు, టీమ్ ఆందోళన, అరెస్టులు (ఫొటోలు)
చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్.. ఆపరేషన్ గరుడలో భాగమే: బుద్దా
నాన్ బెయిలబుల్ వారంట్ అందుకున్న 16 మంది నేతలు వీరే...
శ్రీవారి సేవలో ఉండగా చంద్రబాబుకు అరెస్టు వారెంట్ జారీ
బాబుకు నాన్ బెయిలబుల్ వారంట్: టీ.టీడీపీ నేతల అత్యవసర సమావేశం