జాగ్రత్త... రిటైరయి ఎక్కడికెళ్లినా వదిలేది లేదు...: పోలీసులకు అచ్చెన్న స్ట్రాంగ్ వార్నింగ్

By Arun Kumar PFirst Published May 26, 2021, 3:08 PM IST
Highlights

రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సహా ప్రతి పోలీస్ అధికారి వారి ఒంటిపై ఖాకీ దుస్తులు, స్టార్స్ ఉన్నాయనే విషయం గుర్తుంచుకొనే పనిచేస్తున్నారా? అని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

అమరావతి: ఒక దుర్మార్గమైన శాడిస్ట్ ముఖ్యమంత్రి పాలనను ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి  కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తాను 16నెలలు జైల్లో ఉండివచ్చాడు కాబట్టి అందరూ అలానే జైలుకు వెళ్లాలని ఈ ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లున్నాడని అన్నారు. అందుకే అయినదానికీ, కానిదానికీ ప్రతిపక్షనేతలను తప్పుడు కేసులతో అరెస్ట్ చేయిస్తున్నాడని అచ్చెన్న మండిపడ్డాడు. 

''రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సహా ప్రతి పోలీస్ అధికారి వారి ఒంటిపై ఖాకీ దుస్తులు, స్టార్స్ ఉన్నాయనే విషయం గుర్తుంచుకొనే పనిచేస్తున్నారా? ప్రభుత్వాలు, అధికారం శాశ్వతం కావు. టీడీపీ అధికారంలోకి వచ్చే సమయానికి తాము రిటైరవుతాం లేదా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతామని కొందరు పోలీసులు భావిస్తున్నారు. కానీ టీడీపీ అధికారంలోకి వస్తే అలా ఆలోచించే ఏ ఒక్క పోలీస్ అధికారి ప్రశాంతంగా ఉండడు'' అని హెచ్చరించారు.

read more  ఆ అధికారుల జాబితా సిద్దం... భవిష్యత్ లో భారీ సత్కారం: కర్నూల్ టిడిపి చీఫ్ వార్నింగ్

''బిసి జనార్థన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన ప్రత్యర్థులు, వైసీపీ నేతలపై ఒక్క తప్పుడు కేసు అయినా పెట్టించారా? జనార్థన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఇంటిపైకి వెళ్లాడా? ఎమ్మెల్యే అనుచరులు జనార్థన్ రెడ్డి ఇంటిపైకి వచ్చారా? పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం ఆపాలి. వైసీపీ వారిచ్చే ఫిర్యాదులు తీసుకొని, టీడీపీ వారి ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తారా..? డీజీపీ తక్షణమే జోక్యంచేసుకొని జనార్థన్ రెడ్డి, ఆయన అనుచరులిచ్చిన ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి'' అని డిమాండ్ చేశారు.

''జనార్థన్ రెడ్డిసతీమణి ఇందిరారెడ్డి సహా ప్రతి టీడీపీ నేత, కార్యకర్తకు పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నా. ముఖ్యమంత్రి అరాచకాలను, దుర్మార్గాలను ఎదిరించి నిలిస్తేనే , రాష్ట్రాన్ని భావితరాలను కాపాడుకోగలమని ప్రతి ఒక్క టీడీపీ నేత, కార్యకర్త గ్రహించాలి'' అని అచ్చెన్నాయుడు సూచించారు.


 

click me!