అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు... క్షమాపణలు కోరిన అచ్చెన్నాయుడు

By Arun Kumar PFirst Published Sep 14, 2021, 2:52 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ప్రివిలేజ్ కమిటీ ముందు ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు క్షమాపణలు కోరారు.

అమరావతి: ఛైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం మంగళవారం అమరావతిలోని అసెంబ్లీ కమిటీ హాల్ లో జరిగింది. గతంలో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ప్రివిలేజ్ కమిటీ పలువురు టిడిపి నాయకులకు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులు అందుకున్న ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెనాయుడు ఇవాళ కమిటీ ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు.  

ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలపై కమిటీ విచారణ చేపట్టింది. ప్రివిలేజ్ కమిటీకి అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. ప్రివిలేజ్ కమిటీ ముందు క్షమాపణ కోరారు అచ్చెన్నాయుడు. దీంతో అతడిపై చర్యలు తీసుకోకుండా ప్రివిలేజ్ కమిటీ వెనక్కి తగ్గింది.  

ఇక మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రివిలేజ్ కమిటీముందు హాజరుకాలేదు. గత సమావేశానికి హాజరు కాకపోవడంపై రవికుమార్ పై ప్రివిలేజ్ కమిటీ సీరియస్ అయింది. అయితే ఈ సమావేశానికి కూడా ఆయన హాజరుకాకపోవడంతో చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. అయితే తనకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు అందలేదని కూన రవికుమార్ చెబుతున్నారు.  

అయితే తాను అందుబాటులో లేని గతంలో కూన రవికుమార్ చేసిన ప్రకటనపై ప్రివిలేజ్ కమిటీ చర్చించింది. అందుబాటులో ఉండి కూడ అవాస్తవాలు చెప్పారని కమిటీ అభిప్రాయపడింది. కూన రవికుమార్ అవాస్తవాలు చెప్పారనే విషయానికి ఆధారాలున్నాయని కమిటీ తేల్చి చెప్పింది. ఆధారాలను పరిశీలించిన తర్వాత కూన రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకొంది సమావేశం. ఈ నెల 21న మరోసారి సమావేశం కావాలని  నిర్ణయం తీసుకొన్నారు చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి.

click me!