ఏపి సచివాలయంలో కలకలం... హైదరాబాద్ నుండి వచ్చిన ఉద్యోగికి కరోనా

By Arun Kumar PFirst Published May 30, 2020, 1:03 PM IST
Highlights

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేగింది.హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది.

అమరావతి: ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. దీంతో సచివాలయ ఉద్యోగులతో పాటు అతడితో పాటే హైదరాబాద్ నుండి ఏపికి వచ్చిన వారు ఆందోళనకు గురవుతున్నారు.   

దీంతో గత రెండ్రోజులుగా అతనితో కలిసి తిరిగిన వారితో పాటు సికింద్రాబాద్ బస్‌లో వచ్చిన ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఉద్యోగి మంగళగిరి మండలం నవులూరు గోలివారితోట లో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. 

ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి కోవిడ్ విభాగంకు తరలించేందుకు అధికారుల సన్నాహాలు చేస్తున్నారు. మంగళగిరి ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమై ఆ అపార్ట్ మెంట్ ప్రాంతంలో శానిటైజ్ చేస్తున్నారు. 

read more  ఏపీలో ఆగని కరోనా విజృంభణ: 2841కి చేరుకున్న పాజిటివ్ కేసులు, 59 మరణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.  రాష్ట్రంలో శుక్రవారం 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 11,637 శాంపిల్స్ ను పరీక్షించగా 33 మందికి కోవిడ్ 19 సోకినట్లు తేలింది.  గత 24 గంటల్లో 79 మంది కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. కరోనా వైరస్ తో తాజాగా కర్నూలులో ఒకరు మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా వైరస్ మరణించినవారి సంఖ్య 60కి చేరుకుంది.

తాజా కేసులతో ఏపీలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2874కు చేరుకుంది. వీరిలో 2037 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ కాగా, 777 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో ఆరు కోయంబేడుతో లింకులున్నవే. కోయంబేడు నుంచి వచ్చినవారిలో కరోనా వైరస్ వ్యాధి సోకినవారిలో చిత్తూరు జిల్లాకు చెందినవారు నలుగురు ఉండగా, నెల్లూరు జిల్లాకు చెందినవారు ఇద్దరు ఉన్నారు. 

విదేశాల నుంచి వచ్చినవారిలో 111 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఈ 111 మంది కూడా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 345 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో 22 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. 156 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

 


 

click me!