పీఆర్సీ ఇష్యూని సైడ్ చేసేందుకే కొత్త జిల్లాలు.. పెయిడ్ ఆర్టిస్ట్‌లతో చర్చలా: బండి శ్రీనివాసరావు సంచలనం

By Siva KodatiFirst Published Jan 28, 2022, 3:37 PM IST
Highlights

ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే తెరపైకి కొత్త జిల్లాల అంశం తీసుకొచ్చారని ఏపీ ఎన్టీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పుడో చేపట్టాల్సిన ప్రక్రియ అని శ్రీనివాసరావు అన్నారు. కొంత మంది కావాలనే పెయిడ్ ఆర్టిస్ట్‌లను తయారు చేసి చర్చలు జరపడం కరెక్ట్ కాదంటూ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ప్రభుత్వం (ap govt)- ఉద్యోగుల మధ్య పీఆర్సీ (prc) వివాదం ముదరుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఈ నెలకు పాత జీతాలే ఇవ్వాలని, రాత్రి పూట ఇచ్చిన  చీకటి జీవోలు రద్దు చేయాలని ఏపీ ఎన్టీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు (bandi srinivasa rao) డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే తెరపైకి కొత్త జిల్లాల అంశం తీసుకొచ్చారని ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పుడో చేపట్టాల్సిన ప్రక్రియ అని శ్రీనివాసరావు అన్నారు. 

ప్రభుత్వం ఏం చేసినా తమ ఉద్యమం పక్కదారి పట్టదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి మండలి ఉపసంఘం సమస్యని జటిలం చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగులను రెచ్చగొట్టే దోరణిలో ఏ చిన్న సంఘం వచ్చినా చర్చలు  జరుపుతామని చెప్పడం సరికాదన్నారు. కొంత మంది కావాలనే పెయిడ్ ఆర్టిస్ట్‌లను తయారు చేసి చర్చలు జరపడం కరెక్ట్ కాదంటూ శ్రీనివాసరావు సంచలన  వ్యాఖ్యలు చేశారు. కొంత మంది కలెక్టర్లు, ఐఎఎస్ అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని, రేపటి నుంచి వాళ్ల దగ్గర పని చేసే వాళ్లు కూడా ఉండరని ఆయన స్పష్టం చేశారు. 

మరోవైపు PRC సాధన సమితితో చర్చల కోసం ఎదురు చూపులుండవని ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. శుక్రవారం నాడు అమరావతిలో  Botsa Satyanarayana మీడియాతో మాట్లాడారు. Employees Unionsతో చర్చించేందుకు తాము నాలుగు మెట్లు దిగడానికి కూడా సిద్దంగా ఉన్నామని  ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy వ్యాఖ్యలను అలుసు తీసుకొన్నారని మంత్రి మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలు ముందుకు వస్తేనే చర్చలుంటాయని ఆయన తేల్చి చెప్పారు. చర్చల కోసం ఉద్యోగ సంఘాల కోసం ఎదరు చూపులుండవని ఆయన స్పష్టం చేశారు. మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని ఆయన ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు.

ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగమేననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారంగా   ఏ ఒక్కరికి కూడా రూపాయి తగ్గదని మంత్రి తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే  చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని బొత్స సత్యనారాయణ కోరారు. మనలో మనం  ఘర్షణ పడొద్దని మంత్రి సూచించారు. జీతాలు పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో ఒకటో తేదీన వచ్చే పే స్లిప్ లో తెలుస్తాయని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కానీ జీతాలు వద్దని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయన్నారు.ఉద్యోగ సంఘాలు ఏమనుకొంటున్నాయో అర్ధం కావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉందన్నారు. సీనియర్ మంత్రులు వచ్చి కూర్చోన్నా కూడా ఉద్యోగ సంఘాలు చర్చలకు రాకపోవడం బాధాకరమన్నారు. 

click me!